భారత్ను రెచ్చగొడుతున్న డ్రాగన్: ‘అరుణాచల్ ప్రదేశ్’ను ఎప్పుడూ గుర్తించమన్న చైనా
న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో చైనా మరోసారి తన పైత్యాన్ని చాటుకుంది. భారత్ను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. తాము అరుణాచల్ ప్రదేశ్ను ఎప్పటికీ గుర్తించమని చెప్పింది. తాము ఈ ప్రాంతాన్ని చైనా సౌత్ టిబెట్ ప్రాంతంగానే గుర్తిస్తామని చెప్పుకొచ్చింది.
చైనా నుంచి 2 సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్లు: ట్రేడ్ ఫెయిర్లో ప్రదర్శన, 300 మిలియన్ డోసులు
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావ లిజియాన్ చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్తో మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్ను చైనా ఎప్పుడూ గుర్తించదని అన్నారు. అది చైనాకు చెందిన సౌత్ టిబెట్ రీజియన్ అని పేర్కొంది. అయితే, చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాష్టానికి చెందిన ఐదుగురి గురించి మాత్రం స్పందించలేదు.
భారత ఆర్మీ నుంచి ఆ ఐదుగురు భారతీయుల గురించి ఇప్పటికే ఓ సందేశం వచ్చిందని చెప్పిన ఆయన.. వారి అదృశ్యం, విడుదలపై తాము భారత ఆర్మీ కి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పారు.
అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందని, దీనిపై భారత ఆర్మీ వారికి హాట్లైన్ మెసేజ్ పంపిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా అధికార ప్రతినిధి స్పందించారు.
కాగా, అప్పర్ సుబాన్సిరి జిల్లాలోని భారత్-చైనా సరిహద్దు అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లిన ఐదుగురు అరుణాచల్ప్రదేశ్ వాసులను చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని నాచో ప్రాంతంలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. మరో ఇద్దరు చైనా ఆర్మీ నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
టోక్ సింగ్కమ్, ప్రసత్ రింగ్లింగ్, డొంగ్తు ఈబియా, తను బెకర్, నరు దరి అనే ఐదురిని చైనా బలగాలు కిడ్నాప్ చేశాయని తెలిపారు. వీరంతా టగిన్ కమ్యూనిటీకి చెందినవారు. జిల్లా కేంద్రం దపోరిజోలో ఉండే బాధితుల కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. తమవారి కిడ్నాప్ విషయమై భారత ఆర్మీతో చర్చించేందుకు తమ బంధువులు వెళ్లారని తెలిపారు. నాచో జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.