నేపాల్కు షాక్: సరిహద్దును ఆక్రమించి 11 భవనాల నిర్మించిన చైనా, నేపాలీలకు నో ఎంట్రీ!
ఖాట్మాండు: కయ్యాల మారి చైనా తన మిత్రదేశంగా ఉన్న నేపాల్ పట్ల కూడా తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న నేపాల్ దేశంలోని హుమ్లా జిల్లాకు చెందిన పలు ప్రాంతాల్లో డ్రాగన్ దేశం అక్రమంగా 11 భవనాలను నిర్మించినట్లు సమాచారం. దీంతో నేపాల్ ప్రజలు తీవ్ర ఆందోళనలు చేపట్టారు.
Recommended Video
నేపాల్ భూభాగంలో 11 భవనాలు నిర్మించిన చైనా..
అంతేగాక, ఆ 11 భవనాలు నిర్మించిన ప్రాంతంలోకి నేపాల్ ప్రజలను గానీ, మీడియాను గానీ అనుమతించకపోవడం గమనార్హం. సరిహద్దు ప్రాంతంలో ఒక బోర్డర్ పిల్లర్ను మాయం చేసిన చైనా.. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని భవనాలను నిర్మించిందని నేపాల్ ప్రజలు ఆరోపిస్తున్నారు. వివాదాస్పదంగా ఉన్న ఆ ప్రాంతంలో 2005లో చిన్న గుడిసె మాత్రమే ఉండేదని నేపాలీ అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ భవనాలు నిర్మించిన ప్రాంతం తమ దేశ భూభాగంలోనిదేనని చైనా చెబుతోందని స్థానిక మున్సిపల్ అధికారి బిష్ణు బహదూర్ తెలిపారు. ఇటీవలే తాము ఆ ప్రాంతాన్ని సందర్శించి వచ్చామని చెప్పారు. కాగా, ఆ భవనాలను చైనా భద్రతా, సరిహద్దు దళాలు నిర్మించివుంటాయని నేపాల్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆ భవనాల వద్దకు నేపాలీ అధికారులను రానివ్వని చైనా..
ఆదివారం హుమ్లా జిల్లా ముఖ్య అధికారి చిరింజిబి గిరి నేతృత్వంలో ఒక బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది. భవనాలు నిర్మించిన ప్రాంతం నుంచి ఒక కిలోమీటర్ లోపలి వరకు తమ సరిహద్దులోకి చైనా చొచ్చుకొచ్చిందని సదరు అధికారుల బృందం గుర్తించింది. నేపాల్ పరిధిలో ఉన్న ఆ ప్రాంతం వివాదాస్పదంగా ఉందని, ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు సైనిక బలగాల సంచారం తప్ప ఎలాంటి నిర్మాణాలు లేవని, ఇప్పుడు 11 భవనాలను చైనా నిర్మించిందని నేపాల్ మీడియా పేర్కొంది.
భవనాలు నిర్మించిన ప్రాంతంలోకి నేపాలీ అధికారులు వెళ్లగా.. చైనా భద్రతా దళాలు ట్రక్కు, ట్యాంకర్లో అక్కడికి చేరుకున్నాయి. మైక్రో ఫోన్లో మాట్లాడుతూ.. మీరంతా(నేపాళీ అధికారులు) సరిహద్దు వెళ్లి అక్కడ్నుంచి మాట్లాడాలంటూ వారిని అక్కడ్నుంచి పంపించేశాయి. దీంతో చైనా నుంచి సమాధానం కోసం నేపాల్ అధికారులు గంటన్నరపాటు వేచిచూశారు. ఆ తర్వాత వచ్చిన చైనా అధికారులు ఆ భవనాలు తమ ప్రాంతంలోనే కట్టుకున్నామని, ఓ మ్యాప్ కూడా చూపించడంతో నేపాలీ అధికారులు షాక్ తిన్నారు. అది తమ భూభాగమని చెప్పినా చైనా అధికారులు వినిపించుకోలేదు.
సరిహద్దు పిల్లర్ అదృశ్యం కావడంతో.. ఆ ప్రాంతంపై చైనా కన్నేసింది
ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ నేపాల్ హోంమంత్రిత్వ శాఖ స్థానిక జిల్లా అధికారులను ఆదేశించింది. వారంలోపల నివేదికను సమర్పించాలని కోరింది. సరిహద్దులో ఉన్న ఓ పిల్లర్ అదృశ్యమవడంతో ఆ ప్రాంతం వివాదాస్పదంగా మారిందని హుమ్లా ఎంపీ చక్క బహదూర్ లామా తెలిపారు. 12ఏళ్ల క్రితం రోడ్డు నిర్మాణం జరుగుతుండగా సరిహద్దుగా ఉన్న పిల్లర్ ధ్వంసమైందని, అనాటి నుంచి తమ భూభాగంగా ఉన్న ఆ ప్రాంతం వివాదాస్పదంగా మారిపోయిందన్నారు. నేపాల్-టిబెట్ల మధ్య వాణిజ్య మార్గంగా ఉన్న పాత యాక్ కరవాన్ రూట్లో చైనా ఈ భవనాలను నిర్మించిందని తెలిపారు.
2015లో నేపాల్, చైనాల మధ్య సరిహద్దు ఒప్పందం జరిగినా.. చైనా మాత్రం దాన్ని గుర్తించడం లేదని అన్నారు. దేశానికి సంబంధించిన ఈ కీలక అంశంపై నేపాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
భవనాలు నిర్మించింది తమ ప్రాంతంలోనేనంటూ చైనా.. నిరసనలు
కాగా, ఖాట్మాండులోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిది ఝాంగ్ సి మాట్లాడుతూ.. మీడియాలో పేర్కొన్న ఆ భవనాలు చైనాకు చెందిన భూభాగంలోనే ఉన్నాయని చెప్పారు. నేపాల్ ప్రభుత్వమే మరోసారి సరిచూసుకోవాలని సూచించారు. అంతేగాక, నేపాల్ సార్వభౌమత్వాన్ని చైనా గౌరవిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటికే సరిహద్దుగా ఉన్న పలు ప్రాంతాలను చైనా ఆక్రమించుకుందని స్థానిక నేపాలీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నా.. అక్కడి ప్రభుత్వం అంతగా పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే, చైనా కమ్యూనిస్టు సర్కారుకు నేపాల్ కమ్యూనిస్టు సర్కారుకు మధ్య స్నేహం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చైనా.. నేపాల్కు సాయం చేస్తున్నట్లే చేస్తూ.. వెనుక నుంచి ఇలాంటి ఆక్రమణాలకు పాల్పడుతోంది. నేపాలీ ప్రజలు చైనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.