కరోనా కాలంలో కరెన్సీ పంట: కామన్ పబ్లిక్ జేబుకు చిల్లు..సంపన్నుల ఖజానా గల్లు..!
కరోనావైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం వణుకుతున్నాయి. ఇక వాటి ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తూ అగ్రస్థానంలో ఉన్న రాజ్యాలు సైతం అధమస్థానానికి పడిపోయాయి. దీనికి కారణం కరోనావైరస్. ఒక దేశం పరంగా చూస్తే ఈ మహమ్మారి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటి కష్టసమయాల్లో కూడా ప్రపంచ కుబేరుల ఆస్తులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంతకీ ఆ కుబేరులు ఎవరు..? కరోనాకాలంలో వారి ఆస్తులు ఏమేరకు పెరిగాయో ఒక్కసారి చూడండి...
జెఫ్ బెజోస్ ఆస్తుల్లో 40శాతం పెరుగుదల
కరోనావైరస్ కాలంలో అగ్రరాజ్యాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా వ్యక్తిగతంగా ప్రపంచకుబేరుల ఆస్తులు మాత్రం పెరిగాయి. కోవిడ్-19 కొందరికి అపార నష్టం తీసుకొచ్చి పెడితే మరికొందరికి మాత్రం ఆస్తుల్లో పెంపుదలను తీసుకొచ్చింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా తొలిస్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తులు ఒక్కసారిగా పెరిగాయి. గత నెలతో పోలిస్తే ఆయన ఆస్తుల్లో 40 శాతం పెరుగుదల కనిపించింది. లాక్డౌన్ సమయంలో పలు నిత్యావసరాల డెలివరీ కోసం ప్రజలు దాదాపుగా అమెజాన్ వైపే చూసినట్లు సమాచారం. అంతేకాదు ఎంటర్టైన్మెంట్ వైపు కూడా చూశారు. ఇక అమెజాన్ తొలి త్రైమాసికానికి 73 బిలియన్ డాలర్లు రెవిన్యూను అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 22శాతం అధికంగా ఉంది. ఇర జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ ఆస్తులు కూడా పెరిగి నికర ఆస్తుల విలువ 9.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
అంబానీకి కలిసొచ్చిన ఫేస్బుక్ డీల్
ఇక ఆసియాలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ ఆస్తులు కూడా పెరిగాయి. ఇందుకు కారణం ఫేస్బుక్ జియోలో ఇన్వెస్ట్ చేయడంతో ముఖేష్ ఆస్తుల్లో పెరుగుదల కనిపించింది. ఇక దీని ద్వారా డిజిటల్ యాప్స్ మరియు వైర్లెస్ ప్లాట్ఫాంలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఇక ఈ డీల్ తర్వాత అంబానీ ఆస్తుల విలువ 49 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే 10శాతం మేరా వృద్ధి నమోదు చేసింది. ఇక అలీబాబా గ్రూప్ అధినేత జాక్మా కంటే అంబానీ 3 బిలియన్ డాలర్లతో ముందంజలో ఉన్నాడు.
25 శాతం అధికంగా వృద్ధి నమోదు చేసిన జుకర్బర్గ్
ఇక ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో వాటాలు కొనుగోలు చేయడమే కాకుండా 5.7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడంతో ఫేస్బుక్ షేర్లు గత నెలతో పోలిస్తే 25 శాతం అధికంగా వృద్ధిని రికార్డ్ చేసింది. దీంతో మొత్తం జుకర్బర్గ్ ఆస్తుల విలువ 13.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Recommended Video
లారీ పేజ్ ఆస్తులు
ఇక కరోనా సమయంలో గూగుల్ పై వ్యాధి గురించి అధికంగా సెర్చ్లు నెటిజెన్లు చేయడంతో ఈ సంస్థ అధినేత లారీ పేజ్ నికర ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగింది. ఈ సమయంలో లారీ పేజ్ ఆస్తులు 8.7 బిలియన్ డాలర్లు మేరా పెరిగినట్లు సమాచారం. ఇక స్పేస్ఎక్స్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఆస్తులు 9.6 బిలియన్ డాలర్లు మేరా పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారిపై పోరులో భాగంగా ఎలన్ మస్క్ మెడికల్ ఎక్విప్మెంట్ కొరత ఉన్న చోటుకు యుద్ధ ప్రాతిపదికన పంపారు.