చైనా దురహంకారం: వేడుకలకు ఆహ్వానిస్తే.. తైవాన్ అధికారిపై డ్రాగన్ దౌత్యాధికారి దాడి
తైపీ: చైనా మరోసారి తన దుర్భుద్ధిని బయటపెట్టుకుంటోంది. సామ్రాజ్యవాద కాంక్ష పలు దేశాలను ఇప్పటికే ఆక్రమించుకున్న చైనా.. మళ్లీ ఇప్పుడు తైవాన్ పడింది. ఇప్పటికే తైవాన్ దేశంపై చైనా యుద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అమెరికా.. తైవాన్ దేశానికి మద్దతు పలుకుతోంది. యుద్ధానికి దిగితే చైనా గెలుస్తుంది కావొచ్చు, కానీ, తాము రంగంలోకి దిగితే చైనాకు కోలుకోలేని దెబ్బ తగలుతుందని అమెరికా గట్టిగా హెచ్చరించింది.
తైవాన్ అధికారిపై చైనా దౌత్యాధికారి దాడి
ఈ నేపథ్యంలో ఫిజి రాజధాని సువాలో జరిగిన ఓ కార్యక్రమంలో తైవాన్ ప్రభుత్వ అధికారులపై చైనా దైత్యాధికారులు దాడికి పాల్పడ్డారు. పరస్పరం దాడులు చేసుకోగా.. తైవాన్కు చెందిన ఓ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది. చైనా దురహంకారంపై తైవాన్ తీవ్రస్థాయిలో మండిపడింది.
వేడుకలకు ఆహ్వానిస్తే.. తీవ్రంగా గాయపర్చిన చైనా అధికారి
తైవాన్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబ్ 8న సువాలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ఫిజిలో ఉన్న చైనా దౌత్యాధికారులతో పాటు ఇతర దేశాల ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించారు. అయితే, చైనాకు చెందిన అధికారికి అక్కడికి వచ్చిన అతిథులను ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా.. తైవాన్ అధికారి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు చైనా అధికారి ఘర్షణకు దిగాడు. దీంతో తైవాన్ అధికారికి తలకు తీవ్రగాయాలయ్యాయి.
తైవాన్ తీవ్ర ఆగ్రహం.. చైనా నుంచి నో రెస్పాన్స్..
అక్కడికి చేరుకున్న ఫిజి పోలీసులు.. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన చైనా అధికారిని అక్కడ్నుంచి పంపించివేశారు. కాగా, ఈ ఘటనపై తైవాన్.. చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా అధికారులు హద్దుమీరి ప్రవర్తించారని మండిపడింది. దీనిపై ఫిజి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అయితే, ఈ దాడి ఘటనపై చైనా మాత్రం స్పందించకపోవడం గమనార్హం. కాగా, భారత్తో తైవాన్ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం కూడా చైనాకు నచ్చడం లేదు. చైనాతో ఘర్షణలు జరిగిన సమయంలో కూడా తైవాన్.. భారత్కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే చైనా.. తైవాన్పై దురాక్రమణకు కుట్రలు చేస్తోంది.