అమెరికాలో భారతీయ కుటుంబంపై దారుణం: ఎనిమిది నెలల చిన్నారినీ..!!
వాషింగ్టన్: అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భారతీయ కుటుంబం అపహరణకు గురైంది. ఎనిమిది నెలల చిన్నారి, ఆమె తల్లిదండ్రులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిందెవరనేది ఇంకా తెలియరాలేదు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోన్నట్లు కాలిఫోర్నియా పోలీస్ కమిషనర్ కార్యాలయం పేర్కొంది. డబ్బుల కోసం కిడ్నాప్ చేసి ఉండే అవకాశాలను కొట్టి పారేయలేమని తెలిపింది.
అపహరణకు గురైన వారిలో జస్దీప్ సింగ్, జస్లీన్ కౌర్, ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరితో పాటు అమన్దీప్ సింగ్ ఉన్నారు. కొన్నేళ్లుగా జస్దీప్ సింగ్ కుటుంబం కాలిఫోర్నియా మెర్సిడ్ కౌంటీలో నివసిస్తోంది. మెర్సిడ్ కౌంటీ బ్లాక్ నంబర్ 800, సౌత్ హైవే 59లో ఓ షాప్ను జస్దీప్ నిర్వహిస్తోన్నారు. అక్కడి నుంచే ఈ నలుగురినీ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు మెర్సిడ్ కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది.
దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నందున పూర్తి వివరాలు తెలియరావట్లేదని స్థానిక మీడియా హౌస్ ఏబీసీ 10 తెలిపింది. సాధారణంగా సౌత్ హైవే 59 రద్దీతో కూడుకుని ఉన్న ప్రాంతం. ఈ మార్గంలో పెద్ద ఎత్తున రెస్టారెంట్స్, రిటైల్ షాప్స్ ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న బ్లాక్ నంబర్ 800లో జస్దీప్ సింగ్ ఓ రిటైల్ షాప్ను నిర్వహిస్తోన్నారు. షాప్కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ నలుగురినీ తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేసినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదు అందిందని మెర్సిడ్ కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది.
ఆ ఆగంతకుల గురించి ఆచూకీ తెలిసిన వారు 911కు ఫోన్ చేసి, సమాచారం ఇవ్వాల్సిందిగా కాలిఫోర్నియా పోలీస్ కమిషనరేట్ ఓ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దుండగులు ఏ ఉద్దేశంతో జస్దీప్ కుటుంబాన్ని అపహరించారనేది ఇంకా తెలియరావట్లేదని పేర్కొంది. ఇదివరకు కాలిఫోర్నియాలో ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. 2019లో తుషార్ ఆత్రే అనే టెక్కీ- తన గర్ల్ఫ్రెండ్ కారులో మృతదేహంగా కనిపించాడు. ఓ డిజిటల్ కంపెనీ ఓనర్ అతణ్ని కిడ్నాప్ చేసినట్లు అప్పట్లో పోలీసులు నిర్ధారించారు.