శ్రీలంకలో భారత ఫొటో జర్నలిస్టు సిద్దిఖి అరెస్ట్.... ఎందుకంటే
ఢిల్లీకి చెందిన రాయటర్స్ న్యూస్ ఏజెన్సీ ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్టర్ సండే పేలుళ్ల అనంతర పరిణామాలకు సంబంధించిన వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఓ స్కూల్లోకి వెళ్లాడంటూ ఇల్లీగల్ ట్రెస్ పాస్ కింద పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో రాయటర్స్ న్యూస్ ఏజెన్సీలో ఫొటో జర్నలిస్ట్ గా పని చేస్తున్న సిద్దిఖి అహ్మద్ డానిష్ శ్రీలంక వెళ్ళారు. ఉగ్రదాడుల అనంతరం పరిణామాలను ఫొటోల్లో బంధించేందుకు వెళ్ళిన సిద్దిఖి నెగొంబోలోని ఓ స్కూలు అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆయన అనుమతి లేకుండా బలవంతంగా లోపలికి వెళ్లాడని ఆరోపిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నెగొంబో మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. ఈ నెల 15 వరకు మేజిస్ట్రేట్ సిద్దిఖికి రిమాండ్ విధించినట్టు తెలిపారు.
కేరళ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ సంచలనం ..అమ్మాయిలు ముసుగు ధరించటం నిషేధం
శ్రీలంక స్థానిక మీడియా కథనం ప్రకారం.. సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన ఉగ్రదాడిలో ఓ స్కూలు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు సిద్దిఖీ స్కూలులోకి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాధిత విద్యార్థి తల్లిదండ్రులు తమ అనుమతి లేకుండా ఫోటోలు తీస్తున్నాడని , అనుమతి లేకుండా లోపలికి బలవంతంగా ప్రవేశించాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు సిద్దిఖీని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.సిద్ధిఖీకి ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించారు.