కరోనా విలయం: చైనాలో మళ్లీ కల్లోలం.. వెల్లువలా ‘సెకండ్ వేవ్’.. వైరస్ పుట్టిన వూహాన్లోనూ..
''ఇక మహమ్మారి పీడ విరగడైనట్లే.. మా దేశంలో ఎక్కడా వైరస్ వ్యాప్తి సీరియస్ దశలో లేదు.. ఒకప్పటి ఎపిసెంటర్ వూహాన్ సహా అన్ని నగరాల్లో ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు పున:ప్రారంభమయ్యాయి..''అని ఘనంగా ప్రకటించుకున్న వారం రోజులకే చైనా సర్కారుకు భారీ షాక్ తగిలింది. చాపకింద నీరులా విస్తరిస్తోన్న అసింప్టమాటిక్ కేసులు డ్రాగన్ దేశాన్ని మళ్లీ కల్లోలంలోకి నెట్టేశాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 17 కేసులు వెలుగులోకి రాగా, అందులో మెజార్టీ కేసుల మూలాలను కనిపెట్టలేకపోయారు.
భయం గుప్పిట్లో షులాన్ సిటీ..
చైనాలో దాదాపు నెల రోజులుగా కొత్త కేసులు నమోదుకాలేదు. దీంతో వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి వచ్చిందనే భావనతో ప్రభుత్వం అన్ని రకాల వ్యాపారాలు, స్కూళ్లు, పబ్లిక్ ప్లేస్ లను రీఓపెన్ చేసింది. విదేశాల నుంచి విమానాలు, నౌకల రాకపోకలకు కూడా అనుమతిచ్చింది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో దేశ ఉత్తర భాగంలో వైరస్ మళ్లీ తిరగబెట్టింది. రష్యా, నార్త్ కొరియా సరిహద్దుల్ని ఆనుకుని ఉన్న జిలిన్, హెలాంగ్జియాంగ్, లియోనింగ్ రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా జిలిన్ రాష్ట్రంలోని షులాన్ సిటీలో పరిస్థితి భయానకంగా మారే అవకాశాలుండంతో ఆదివారం నుంచి తిరిగి లాక్ డౌన్ విధించారు.
ప్రయాణాల వల్లే..
కొత్తగా వైరస్ కాటుకు గురైనవాళ్లలో వ్యాధి లక్షణాలు కనిపించలేదని, ఇలాంటి అసింప్టమాటిక్ కేసులను ‘కరోనా సెకండ్ వేవ్'గానూ పరిగణిస్తామని చైనీస్ అధికారులు చెప్పారు. కాగా, పొరుగుదేశంలో రష్యాలో వైరస్ వ్యాప్తి పీక్ దశలో ఉందని, అక్కడి నుంచి నౌకల ద్వారా చైనాకు ప్రయాణాలు చేసిన వారి ద్వారానే కరోనా వ్యాపించిందని పేర్కొన్నారు. ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్లందరీ క్వారంటైన్ కు తరలించామన్నారు. ఇన్నాళ్లూ ప్రమాదకర పరిస్థితులు లేవని చెప్పిన చైనా.. షులాన్ సిటీని ‘హై రిస్క్ జోన్'గా ప్రకటించడం అక్కడి తీవ్రతను తెలియజేస్తున్నది.
వైరస్ పుట్టిన చోటు..
చైనా ఉత్తర సరిహద్దులతోపాటు దేశ మధ్యభాగంలోని హుబే ఫ్రావిన్స్ లోనూ కొత్త కేసులు నమోదుకావడం గమనార్హం. వైరస్ పుట్టిన వూహాన్ సిటీలో దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ కేసులు బయటపడుతున్నాయి. ఆదివారం నాటికి వూహాన్ లో ఐదుగురికి కరోనా సోకింది. ‘‘అది మళ్లీ వచ్చేసింది..'' అంటూ వూహాన్ సిటీ వాసులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న సమాచారాన్ని బట్టి అక్కడ వైరస్ తీవ్రత మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరిందని, జిన్ పింగ్ సర్కారు మాత్రం కరోనా కేసుల లెక్కల్ని దాచిపెడుతోందనే అభిప్రాయం వెల్లడైంది. వైరస్ ఎపిసెంటరైన వూహాన్ లో ఏప్రిల్ 7 నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ ఎత్తేసిన నెల రోజుల తర్వాత కొత్త కేసులు బయటపడటం గమనార్హం.
Recommended Video
ఇదీ చైనాలో సీన్..
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగడమో, తగ్గడమో జరిగినా, చైనాలో మాత్రం గత రెండు నెలలుగా కేసుల సంఖ్యను 83వేలుగానే పేర్కొంటూ వస్తుండటం గమనార్హం. అందులో 78వేల మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 124కాగా, ఆదివారం నాటి 17 కొత్త కేసులతో అది 141కి పెరిగింది. కరోనా మహమ్మారి వల్ల చైనాలో ఇప్పటిదాకా 4,633 మంది చనిపోయారు.