డ్రగ్స్ మాఫియా: పాక్ విమాన సిబ్బంది అరెస్టు
లాహోర్: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన 13 మంది ఉద్యోగులను అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. విమానంలో అక్రమంగా విదేశాలకు డ్రగ్స్ రవాణ చెయ్యడానికి ప్రయత్నించడంతో వీరు అరెస్టు అయ్యారు.
యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్ (ఎఎన్ఎఫ్) అధికారుల కథనం మేరకు పాకిస్థాన్ లోని లాహోర్ నుంచి దుబాయ్ వెళ్లడానికి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానం రన్ వే మీద సిద్దంగా ఉంది. ఈ విమానంలో మత్తు పదార్థాలు తరలిస్తున్నారని ఎఎన్ఎఫ్ అధికారులకు సమాచారం అందింది.
వెంటనే అధికారులు విమానం నిలిపివేసి క్షుణ్ణంగా పరిశీలించారు. విమానంలోని టాయ్ లెట్ లో ఆరు కిలోల హెరాయిన్ గుర్తించిన అధికారులు షాక్ కు గురైనారు. వెంటనే హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న పై అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన 13 మంది ఉద్యోగులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అందరిని విచారిస్తున్నారు.
ఆదివారం విమాన సిబ్బందిని అరెస్టు చేసి హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని, మార్కెట్ లో హెరాయిన్ విలువ రూ. 6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 13 మంది విమాన సిబ్బందిని అరెస్టు చేశారని, వారు తప్పు చేసినట్లు రుజువు అయితే కఠిన శిక్ష పడుతుందని పీఐఏ స్పోక్స్ పర్సన్ డానియల్ గిలానీ చెప్పారు.