టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఏంజెలా మెర్కెల్
న్యూఢిల్లీ: టైమ్స్ మ్యాగజైన్ 2015 సంవత్సరానికి గాను ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఎంపికయ్యారు. యూరప్ ఆర్థిక స్థితిగతులు, సంక్షోభంలో ఉన్నప్పటికీ సిరియా శరణార్ధులను ఆదుకోవడంలో, సరిహద్దులు లేని ఐరోపాను ఆవిష్కరించడంలో అగ్రస్థానంలో నిలిచారని టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది.
టైమ్స్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' గా ఏంజెలా మెర్కెల్ను ఎంపిక చేసినట్లు బుధవారం టైమ్ మేనేజింగ్ ఎడిటర్ నాన్సీ గిబ్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏంజెలా గురించి గిబ్స్ మాట్లాడుతూ 'మీరు అంగీకరించండి... లేదా వ్యతిరేకిచండి. ఆమె మాత్రం సులభమైన దారులను ఎంచుకోరు. ప్రజలు తమ వెంటలేనప్పుడే నాయకులకు అసలైన పరీక్ష. వీటన్నంటినీ మెర్కెల్ అతి సునాయాసంగా అధిగమించారు' అని కొనియాడారు.
కాగా, 30 ఏళ్లలో ఒక మహిళను 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' గా ప్రకటించడం ఇదే తొలిసారి. ఇది ఇలా ఉంటే, ఈ అరుదైన పురస్కారం కోసం 8 మందితో కూడిన తుది జాబితాలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బాగ్దాదీ కూడా ఉండటం విశేషం.
ఈ సందర్భంగా ‘టైమ్స్ మ్యాగజైన్' అబూబకర్ ఆల్ బాగ్దాదీని ప్రశంసలతో ముంచెత్తింది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న డోనాల్డ్ ట్రంప్ తో సరిసమానంగా అతడు సత్తా చాటుతున్నాడని స్వయానా ఆ మేగజీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'ఐసీస్ నాయకుడిగా ఆయన తనంతట తానుగా ప్రకటించుకుని ఇరాక్, సిరియాల్లో తాను అనుకున్న సొంత రాజ్యాన్ని నిర్మించడంలో బాగ్దాదీ తనదైన శైలిలో తన అనుచరులను ఉత్తేజపరుస్తున్నాడు. అంతేకాక ట్యునీషియా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో భీకర దాడులకు వారిని సర్వసన్నద్ధం చేస్తున్నాడు'' అంటూ టైమ్ పేర్కొంది.
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయనున్న డోనాల్డ్ ట్రంప్తో కలిసి బాగ్దాదీ ఈ రేసులోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే.