బ్యాంకాక్లో మరో పేలుడు: బంగ్లాలో తీవ్రవాదుల అరెస్ట్
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో మంగళవారం మరోసారి బాంబు పేలుడు సంభవించింది. సోమవారం జరిగిన బాంబు పేలుడు సంఘటనను మరవక ముందే మరోసారి బాంబు పేలడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బ్యాంకాక్లోని చావో నదిపై ఉన్న తాస్కిన్ వంతెనపై నుంచి గుర్తు తెలియని దుండగులు పేలుడు పదార్థాన్ని విసిరేశారు. దీంతో నది సమీపంలో పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.
కాగా, సోమవారం బ్యాంకాక్లోని ఓ ప్రార్థనా మందిరం వద్ద జరిగిన బాంబు పేలుడు సంఘటనలో 22 మంది మృతిచెందగా మరో 125 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్లో ముగ్గురు తీవ్రవాదుల అరెస్ట్
ఉగ్రవాద సంస్థ అల్ఖైదాతో సంబంధం ఉన్న నిషేధిత ఇస్లామిక్ స్టేట్కి చెందిన ముగ్గురు తీవ్రవాదులను బంగ్లాదేశ్లో అరెస్టు చేశారు. ధాన్మోండీ, నిలక్కట్ ప్రాంతాల్లో వీరిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
నిందితులు ముగ్గురిని తౌహిదుల్ ఇస్లామ్, సాదేక్ అలీ, అమినుల్ మొల్లిక్లుగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. బంగ్లాదేశ్కి చెందిన లౌకిక బ్లాగర్లు అవిజిత్ రాయ్, అనంత బిజాయ్ దాస్ల హత్యల వెనక వీరు కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు.