పాకిస్తాన్లో మరో హిందూ యువతి కిడ్నాప్...మతం మార్చి పెళ్లి చేసుకున్న ముస్లిం వ్యక్తి
సింధ్ ప్రావిన్స్ : పాకిస్తాన్లో దారుణాలకు హద్దు అదుపూ లేకుండా పోతోంది. కొద్ది రోజుల క్రితం ఓ సిక్కు యువతిని కిడ్నాప్ చేసి ముస్లిం మతంలోకి బలవంతంగా మార్పిడి చేసిన ఘటన మరవక ముందే మరో హిందూ యువతిని కిడ్నాప్ చేసి మతమార్పిడి చేసి ముస్లిం వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ ఘటన సింధు ప్రావిన్స్లో చోటుచేసుకుంది. ఆగష్టు 29న బీబీఏ చదువుతున్న తన కూతురు కాలేజీకి వెళ్లి ఇక ఇంటికి తిరిగి రాలేదని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
బాబర్ అమన్ అనే బాధితురాలి క్లాస్మేట్ తనను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మీర్జా దిలావర్ బేగ్తో కలిసి ఆమెను కిడ్నాప్ చేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కిడ్నాప్ చేశాకా అమ్మాయిని పీటీఐ పార్టీ కార్యకర్త బేగ్ ఇంటికి తరలించినట్లు చెబుతున్నారు. అక్కడే ముస్లిం మతంలోకి అమ్మాయిని బలవంతంగా దింపి ఆపై బాబర్ అమన్కు ఇచ్చి పెళ్లి చేశారు. ఇదిలా ఉంటే పోలీసులు బాబర్ అమన్ సోదరుడిని అరెస్టు చేశారు. బాబర్ అమన్, కిడ్నాప్కు గురైన యువతి ఎక్కడున్నారో చెప్పాలంటే ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆల్ పాకిస్తాన్ హిందూ పంచాయత్ అనే హిందూ ఎన్జీఓ సంస్థ ఘటనను ఖండించింది. రెండు నెలల్లోనే ఇలా యువతులను కిడ్నాప్ చేసి బలవంతపు మతమార్పిడిలకు పాల్పడటం మూడో కేసు అని ఎన్జీఓ సంస్థ పేర్కొంది. పాక్లో మైనార్టీలుగా ఉంటున్న హిందువులకు ఇది ఘోర అవమానం అని ఎన్జీఓ సంస్థ పేర్కొంది. ఇంతా జరుగుతున్న తాము మాత్రం చేతులు కట్టుకుని కూర్చున్నామని చెప్పారు. అంతేకాదు ఈ ఘోరాలను ఆపేందుకు ఎవరైనా ఆకాశం నుంచి దిగి వస్తారా అని ప్రశ్నించారు ఆల్ పాకిస్తాన్ హిందు పంచాయత్ ఎన్జీఓ సంస్థ జనరల్ సెక్రటరీ రవి ద్వాని. ఇదిలా ఉంటే పంజాబ్ ప్రావిన్స్లో ఓ సిక్కు యువతిని కూడా కిడ్నాప్ చేసి బలవంతంగా ముస్లిం మతంలోకి మార్పిడి చేశారు. ఆ తర్వాత ఓ ముస్లిం వ్యక్తికి ఇచ్చి వివాహం జరింపించారు.
సిక్కు మహిళను కిడ్నాప్ ఆతర్వాత ముస్లిం వ్యక్తికి ఇచ్చి వివాహం చేసిన వీడియోను శిరోమణి అకాళీదల్ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా వీడియోను షేర్ చేయడంతో వెలుగు చూసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కు సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి తండ్రి పాకిస్తాన్లోని ఓ గురుద్వారాలో పూజారిగా పనిచేస్తున్నారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కూతురును వెనక్కు తీసుకురాని పక్షంలో తామంతా ఆత్మహత్యకు పాల్పడుతామని ఇమ్రాన్ఖాన్ను హెచ్చరించారు.