Coronavirus:జపాన్ నౌకలో ఉన్న మరో భారతీయుడికి కరోనా వైరస్..ఏడుకు చేరుకున్న సంఖ్య
జపాన్లోని యొకహామా తీరంలో గత కొద్దిరోజులుగా లంగరేసి ఉన్న డైమండ్ ప్రిన్సెస్ అనే నౌకలోని ప్రయాణికులకు కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో భారతీయుడికి కరోనావైరస్ సోకినట్లు అధికారులు నిర్థారించారు. అతన్ని వెంటనే హాస్పిటల్కు తరలించారు. తాజాగా ఈ వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో వైరస్ బారిన పడ్డ భారతీయుల సంఖ్య ఏడుకు చేరుకుంది.
డైమండ్ ప్రిన్సెస్ నౌకలో మొత్తం 3,711 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. ఇందులో 621 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ల్యాబ్ నుంచి వచ్చిన పరీక్షల ద్వారా మొత్తం 88 మందికి కరోనా సోకినట్లు సమాచారం. అంతకుముందు రోజు అంటే సోమవారం రోజున 99 మంది ప్రయాణికులకు పాజిటివ్గా తేలింది. నౌకలో చిక్కుకుపోయిన భారతీయుల గురించి జపాన్లోని ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు వాకాబు చేస్తోంది. ఈ క్రమంలోనే కోవిడ్ 19 బారిన పడిన వారి సంఖ్య 88 ఉండగా అందులో ఒకరు భారతీయుడు ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.
అంతకుముందు ఆరుగురు భారతీయులకు కరోనా వైరస్ సోకిందని ట్వీట్ చేసింది జపాన్లోని ఇండియన్ ఎంబసీ. ఇదిలా ఉంటే ఈ నౌకలో ప్రయాణించిన భారతీయులు మొత్తం 138 మంది ఉన్నారు. ఇందులో 132 మంది సిబ్బంది కాగా మరో ఆరుగురు ప్రయాణికులు. ఈ నౌకలో ప్రయాణించి హాంగ్కాంగ్లో దిగిన ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకిందన్న సమాచారం అందడంతో నౌకను జపాన్లో నిర్బంధించారు. మరోవైపు రెండు వారాల నిర్బంధ గడువు ముగియడంతో ప్రయాణికులు క్రమంగా నౌకను వీడి వారి స్వస్థలాలకు బయలు దేరి వెళ్లారు. ఇక బుధవారం రోజున మరో 500 మంది ప్రయాణికులు నౌక నుంచి బయటకు వస్తారని సమాచారం. సిబ్బంది మాత్రం నౌకలోనే ఉంటారని అధికారులు తెలిపారు.
నౌకలో చిక్కుకుపోయిన భారతీయులను విడుదల చేయించేందుకు జపాన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది.అంతా క్షేమంగానే వస్తారని భరోసా ఇచ్చింది. ఇదిలా ఉంటే నౌకలో ఉన్న 340 మంది అమెరికా దేశస్తులను ఆ ప్రభుత్వం ఖాళీ చేయించింది. వారిని 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచింది. చైనాలో బయటపడ్డ ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఇప్పటికే 2000 మంది మృతి చెందారు. మృతులంతా ఎక్కువగా హూబే ప్రావిన్స్కు చెందినవారే ఉన్నారు.