మరో సారి దాడి జరిగే అవకాశం..! శ్రీలంకకు అమెరికా నిఘావర్గాల హెచ్చరికలు..!!
కొలంబో/హైదరాబాద్ : శ్రీలంకలో చెలరేగిన దారుణ మారణకాండ ఇప్పట్టో చల్లబడేలా కనిపించడం లేదు. జరిగిన దారుణానికి బాద్యత వహిస్తూ అదికారులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నప్పటికి సమస్యకు పరిష్కారం మాత్రం అదికాదని శ్రీలంక ప్రజానికం భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంకలో జరిగిన దారుణ కాండను మర్చిపోక ముందే ఆ దేశానికి మరో షాకింగ్ సమాచారం అందింది. ఉగ్రదాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని సింహళ దేశాన్ని అమెరికా హెచ్చరించింది. దేశ వ్యాప్తంగా కొన్ని చోట్ల దాడులు జరగవచ్చని తెలిపింది. ఈస్టర్ సండేనాడు తెగబడిన ఉగ్రవాద సంస్థే మరోసారి దాడి చేసే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.
పర్యాటక ప్రాంతాలు, రవాణా ప్రాంతాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, పార్కులు, ఆలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, ఇతర ప్రజావేదికల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని యూఎస్ తన లేఖలో పేర్కొంది. ఏప్రిల్26 నుంచి28 వరకు అంటే వారాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో జరిగిన వరుసు బాంబు పేలుళ్ల ఘటనలో 259 మంది ప్రాణాలు కొల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. అయితే ఈ దాడులను తామే చేశామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ స్వయంగా ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆ దేశ పోలీసు అధికారి కూడా రాజీనామా చేశారు.