కలాం ఆర్డినరీ సైంటిస్ట్, రాష్ట్రపతిగానా?: పాక్ శాస్త్రవేత్త
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, 'మిసైల్ మ్యాన్'గా పేరుగాంచిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మృతి పట్ల యావత్ భారతం దిగ్భ్రాంతికి గురై, శోకసంద్రంలో మునిగిన వేళ పాకిస్ధాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్, కలాం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అబ్దుల్ కలాం కేవలం ఓ సాధారణ శాస్త్రవేత్త మాత్రమేనని పేర్కొన్నాడు. 'భారత మిసైల్ ప్రోగ్రామును రష్యా అభివృద్ధి చేసింది. కలాం దానికి ఎలాంటి మార్పులూ చేయలేదు' అని ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు.
అంతేకాదు శాటిలైట్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, ఆస్ట్రో ఫిజిక్స్ విభాగాల విస్తృతికి ఆయన ఎలాంటి సేవలు చేసినట్టు తనకు గుర్తు లేదని అన్నారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతి పదవికి కూడా అనర్హుడని అన్నాడు.
కేవలం ముస్లిం ఓట్ల కోసమే 2002లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆయన్ని రాష్ట్రపతిగా ఎంపకి చేసిందని విమర్శించారు. పాకిస్ధాన్ అణుపితామహుడిగా పేరు తెచ్చుకుని, ఆ తర్వాత అణ్వస్త్ర విజ్ఞానాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న అబ్దుల్ ఖాదిర్ ఖాన్, కలాంకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి.
ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసిన అబ్దుల్ కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)లో చేరారు. ఇంటెగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అధిపతిగా అగ్ని, పృథ్వి క్షిపణలను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించారు.
ఆ తర్వాత స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు బదిలీ అయ్యారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రాకెట్ సాంకేతికతను రూపొందించే బాధ్యతను చేపట్టారు. శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎల్ వీ-111) ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు.