ట్రంప్కు మరో షాక్: ట్రవెల్ బ్యాన్ రాజ్యాంగ విరుద్ధమన్న కోర్టు, ‘అతిక్రమించారు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ రాజ్యాంగ విరుద్ధమని అమెరికా కోర్టు తేల్చి చెప్పింది.
రిచ్మండ్లోని 4వ యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ ఈ మేరకు తీర్పును వెలువరించింది. ట్రావెల్ బ్యాన్పై ట్రంప్, ఇతర అధికారులు చేసిన ప్రకటనలను పరిశీలించిన అనంతరం కోర్టు 9-4 ఓట్ల తేడాతో ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
వరుస షాక్లు
ట్రంప్ ట్రావెల్ బ్యాన్ను వ్యతిరేకించిన కోర్టుల్లో ఇది రెండో ఫెడరల్ కోర్టు కావడం గమనార్హం. గత డిసెంబర్లో తొమ్మిదో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ కూడా ఇదే విధమైన తీర్పునిచ్చింది.
అతక్రమించారు.. వివక్షే..
ట్రావెల్ బ్యాన్తో ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన కోర్టు తీర్పునే ఈ కోర్టు సమర్థించింది. ఇది మతం ఆధారంగా వివక్ష చూపించడమేనని తప్పుబట్టింది.
ఆరు ముస్లిం దేశాలపై..
ఆరు ముస్లిం దేశాలు.. ఛాద్, ఇరాన్, లిబియా, సొమాలియా, సిరియా, యెమన్లపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2017 జనవరి నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
ట్రంప్ సమర్థించుకున్నా..
ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి అమెరికాను రక్షించేందుకు ఈ ట్రావెల్ బ్యాన్ను తీసుకొచ్చినట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అమెరికాలో ఉగ్ర ఘటనలు చోటు చేసుకోకుండా, ప్రశాంతత నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే, ట్రంప్ నిర్ణయంపై సొంత దేశంతోపాటు ప్రపంచ దేశాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు రావడం ట్రంప్కి గట్టి ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు.