యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనంలో కోత: ఎందుకంటే..?
అమ్మకాలు పడిపోవడంతో యాపిల్ సీఈవో టిమ్కుక్ వేతనంలో కోత పడింది.
వాషింగ్టన్: యాపిల్ సీఈవో టిమ్కుక్ వేతనంలో కోత పడింది. గత 15 ఏళ్లలో తొలిసారిగా ఐఫోన్ అమ్మకాలు పడిపోవడంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు దాదాపు 15శాతం వరకు ఉండవచ్చని అంచనా.
ప్రస్తుతం సెప్టెంబర్ 24తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆయనకు 8.7మిలియన్ డాలర్లు (రూ.59.3కోట్ల) చెల్లించినట్లు రెగ్యులేటరీకి యాపిల్ తెలియజేసింది. అంతకు ముందు సంవత్సరం ఆయనకు దాదాపు 10.3మిలియన్ డాలర్లు (రూ.70 కోట్లు) చెల్లించారు.
ముఖ్యంగా యాపిల్ ఆదాయం, నిర్వహణ లాభాలు తగ్గుముఖం పట్టడంతో యాపిల్ టాప్ ఎగ్జిక్యూటీవ్ల వేతనాల్లో కోత విధించినట్లు తెలిసింది. కాగా, యాపిల్ రాబడులు 8శాతం పడిపోయి రూ.14,70,204 కోట్లకు చేరింది. ఇక నిర్వహణ లాభం 16శాతం పడిపోయి 4,08,390 కోట్లకు చేరింది.
2007లో ఐఫోన్ వచ్చిన తర్వాత ఆదాయాలు పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మార్కెట్లో పెరుగుతున్న పోటీయే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఐఫోన్ ఫీచర్లతో సమానంగా ఇతర మొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లను ముంచెస్తున్నాయి. దీంతో వినియోగదారులు వాటివైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ కారణాలతోనే యాపిల్ ఫోన్ల అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది.