ఆ దేశంలో ఐదువేల ఏళ్ల క్రితమే బీర్ ఫ్యాక్టరీ: ఒకేసారి 22,400 లీటర్ల మద్యం తయారీ
కైరో: ఈజిప్టులో చరిత్ర ఎంతో పురాతనమైనదని తెలిసిన విషయమే. కాగా, గత కొంతకాలంగా తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అనేక వస్తువులను వెలికితీశారు. ఇటీవల జరిపిన తవ్వకాల్లో ఓ అస్థిపంజరానికి బంగారం నాలుగు ఉండటం ఆసక్తికర చర్చకు దారితీసింది.
తాజాగా, శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బీర్ ఫ్యాక్టరీని ఈజిప్టులో గుర్తించారు. సుమారు 5వేల ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్నారు. కైరో నగరానికి దక్షిణంవైపున 450 కి.మీ దూరంలో, నైల్ నదికి పశ్చిమవైపున ఉన్న ఏడారిలో అబిడోస్ అనే శ్మాశన ప్రాంతంలో ఈ బీర్ ఫ్యాక్టరీ బయటపడింది. ఇందులో ఎనిమిది యూనిట్లు ఉన్నాయి.
ఒక్కో యూనిట్ 20 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు ఉన్నాయి. యూనిట్ లో దాదాపు 40 కుండలు ఉన్నాయి. వీటిలోనే బీర్ తయారీకి కావాల్సిన పదార్థాలను వేసి వేడిచేసేవారని అంచనా వేస్తున్నారు. వీటిలో ఒకేసారి 22,400 లీటర్ల (సుమారు 5,900 గ్యాలన్ల) బీరును ఉత్పత్తి చేయగలదని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పారు.
కింగ్ నర్మాన్ అనే చక్రవర్తి హయాంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కింగ్ నార్మన్కు క్రీస్తుపూర్వం 3150-2613 మధ్య తొలి ఐక్య ఈజిప్టు రాజ్యాన్ని పరిపాలించిన రాజుగా పేరు ఉండటం గమనార్హం. కాగా, ఈజిప్టు పర్యాటక శాఖ ఈ తవ్వకాలను పర్యవేక్షిస్తోంది.
మరోవైపు, కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఈజిప్టు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా, తవ్వకాల్లో బయటపడిన వస్తువులను, ఇతర ప్రాంతాలను పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగించుకోవాలని ప్రయత్నాలను ప్రారంభించింది.