గడ్డ కట్టిన అమెరికా, కెనడా! మైనస్ 45 డిగ్రీలతో గజగజ..!
న్యూయార్క్: అమెరికా తూర్పు తీరం, కెనడా చలికి గడ్డ కట్టుకుపోతున్నాయి. 'బాంబ్' మంచు తుపాను తర్వాత 'ఆర్కిటిక్ బ్లాస్ట్'తో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అమెరికా గజగజ.. 2,700 విమానాలు రద్దు, స్కూళ్లు మూసివేత, గడ్డకట్టిన నయగారా!
కెనడా ఉత్తర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీలకు పడిపోయాయి. బాంబ్ తుఫాను ధాటికి అమెరికాలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, కెనడాలో ఇద్దరు మరణించారు.
ఆర్కిటిక్ నుంచి అతిశీతల గాలులు...
అమెరికా, కెనడాలపై మంచుతుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న ప్రమాదకర చలిగాలులకు ఇరుదేశాలు వణికిపోతున్నాయి. అమెరికాలోని మూడింట రెండు వంతుల రాష్ట్రాల్లో మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా, కెనడాలోని ఉత్తర అంటారియో, క్యూబెక్లలో ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. రోడ్లన్నీ మంచుతో కప్పబడిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో ప్రజలు భయకంపితులవుతున్నారు.
గంటలతరబడి విమానాశ్రయంలో...
‘బాంబ్' మంచుతుపాను ప్రభావం విమానాల రాకపోకల మీద కూడా పడింది. న్యూయార్క్, దక్షిణ కరోలినా సహా పలు ప్రాంతాల్లో విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. శనివారం ఒక్క రోజే 2,250 విమానాల రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లో ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు వందలాది పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. ఐటీ కంపెనీలు, ప్రైవేటు సంస్థలు కూడా తమ కార్యకలాపాలకు విరామమిచ్చాయి.
షాపుల ముందు ప్రజల క్యూ...
మంచు తుపాను నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్ సిటీ, ఫిలడెల్ఫియా, బోస్టన్, కరోలినా, మేరీల్యాండ్, వర్జీనియా, ఫ్లోరిడా ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మంచు పడకముందే ప్రజలు బయటకు వచ్చి పాలు, గుడ్లు, ఇతర వంట సామగ్రిని కొనేందుకు షాపుల ముందు క్యూ కడుతున్నారు. పరిస్థితి తీవ్రం కావడంతో అమెరికాలో ఎప్పుడూ లేనంతగా గ్యాస్ ధరలు అమాంతం కొండెక్కాయి. కెనడాలో భారీ గాలులకు విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మనదేశంలోని కశ్మీర్లోనూ...
కశ్మీర్లో ఈ సీజన్లోనే అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లఢక్ మీదుగా వీస్తున్న శీతలగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పతనమవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. లఢక్ ప్రాంతంలో, కార్గిల్లో రికార్డు స్థాయిలో మైనస్ 18.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్లో శనివారం మైనస్ 1.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఒక్కరోజులోనే ఐదు డిగ్రీలు పతనమైంది. కశ్మీర్లోని మిగతా పట్టణాలు గుల్మార్గ్ (మైసన్ 9.4), ఖాజీగుండ్, కుప్వారా (మైనస్ 4.6), కోకర్నాగ్ (మైనస్ 4.4)ల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. హిమాచల్ ప్రదేశ్లోని కొండప్రాంతం కేలాంగ్లో మైనస్ 12.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
రైళ్ల రద్దు, రాకపోకలు ఆలస్యం...
మరోవైపు పొగమంచు కారణంగా ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా, పలు రాష్ట్రాల్లో 39 రైళ్లను ఇప్పటివరకు రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మరో 50 రైళ్లు ఆలస్యంగా నడుపుతుండగా, 16 రైళ్లను వాయిదా వేసినట్లు తెలిపారు. హర్యానాలో చలితీవ్రత కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.