హైదరాబాద్ నిజాం డబ్బులపై భారత్-పాక్ వివాదం: 70 ఏళ్ల తర్వాత తీర్పు ఇవ్వనున్న లండన్ కోర్టు
లండన్: ఇంగ్లాండ్ మరియు వేల్స్ హైకోర్టు ఓ చారిత్రాత్మక తీర్పును ఇవ్వనుంది. ఈ కేసులో భారత్ పాకిస్తాన్ దేశాలతో పాటు హైదరాబాదు ఏడవ నిజాంలు ఉన్నారు. ఇంతకీ ఆ కేసు ఏంటి..భారత్ పాకిస్తాన్ నిజాం రాజులకు సంబంధం ఏమిటి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నిజాం డబ్బులను చుట్టుముట్టిన వివాదాలు
1948లో అప్పటి హైదరాబాదు నిజాం రాజు లండన్ బ్యాంకులో 1 మిలియన్ పౌండ్లను డిపాజిట్ చేశాడు. ప్రస్తుతం దాని విలువ 35 మిలియన్ పౌండ్లుకు చేరింది. దీనికి సంబంధించిన డబ్బులు మాకుచెందాలంటే మాకు చెందాలని ఇటు భారత్లో నివసించే నిజాం వారసులతో పాటు అటు పాకిస్తాన్ కూడా కోర్టుకెక్కింది. ఈ కేసు పలు మలుపులు తీసుకుంది. భారతీయులకు నిజాం ఇచ్చిన కానుకే ఆ డబ్బులని భారత్లో ఉన్న నిజాం వారసులు చెప్పారు.1948లో హైదరాబాదు రాజ్యం భారత్లో విలీనం అవుతున్న సమయంలో దీని అభివృద్ధికి ఆ డబ్బులు ఇచ్చారని కూడా తెలిపింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధిచిన వాదనలు ముగిశాయి. జస్టిస్ మార్కస్ స్మిత్ తీర్పును ప్రకటించనున్నారు. డబ్బులు తమకే చెందాలంటూ భారత్కు చెందిన నిజాం వారసుడు ముఫఖంఝా , కేంద్ర ప్రభుత్వం, మరియు భారత రాష్ట్రపతి చెబుతున్నారు.
నిజాం డబ్బుల కేసు వివరాలు ఇవీ
లండన్లో నాటి పాకిస్తాన్ దౌత్యవేత్తగా ఉన్న హబీబ్ ఇబ్రహీం రహీమ్తులాకు ఏడవ నిజాం 1 మిలియన్ పౌండ్లును ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బులు బదిలీ చేస్తూ ఆ డబ్బును జాగ్రత్తగా భద్రపరచాలని కోరాడు. ఈ డబ్బును నాట్వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఇక అప్పటి నుంచి దశాబ్దాలుగా వడ్డీ పెరుగుతూ వస్తోంది. ఇక ఆ డబ్బులు నిజాం వారసులకే దక్కాల్సి ఉండగా... 70 ఏళ్ల పాటు ఆ డబ్బు నిజమైన వారసులకు దక్కకుండా పాక్ అడ్డుపడిందని భారత్ తరపున వాదించిన లాయర్ పాల్ హెవిట్ తెలిపారు. ఇక వాదనలు ముగియడంతో డబ్బు భారత్లోని వారసులకే అందుతుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఇక నిజాం రాజు 1967 మృతి చెందగా అంతకంటే రెండేళ్ల ముందు అంటే 1965లో ఆ డబ్బులు భారత్కు చెందాలంటూ ఓ వీలునామాను రాశారని పాల్ హెవిట్ చెబుతున్నారు.
నిజమైన హక్కుదాడుడెవరో తేలాకే డబ్బులిస్తామన్న బ్యాంకు
ఇదిలా ఉంటే హైదరాబాదు రాజ్యంను భారత్లో విలీనం చేయాలనుకున్న సమయంలో పాకిస్తాన్ నిజాం రాజుకు మారణాయుధాలు ఇచ్చి సహకరించిందని ఆదేశం వాదించింది. అయితే ఆ వాదనలో నిజం లేదని నిజాం తరపున వాదించిన పాల్ హెవిట్ తెలిపారు. ఇక 1948లో నిజాం రాజు తన రాజ్యాన్ని భారత్లో విలీనం చేయాలనుకున్న సమయంలో డబ్బులను తిరిగి ఇచ్చేయాలని కోరారు. అయితే అప్పటికే దీని హక్కు పాక్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహీమ్తుల్లాకు ఉండటంతో నాట్ వెస్ట్ బ్యాంకు ఈ డబ్బును నిలిపివేసింది. ఈ డబ్బుకు సంబంధించి నిజమైన హక్కుదారుడు ఎవరో తేలాకే చెల్లిస్తామని బ్యాంకు చెప్పుకొచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఇక చివరిగా హైకోర్టుకు చేరడం విచారణ ముగియడం జరిగిపోయింది. మరో ఆరువారాల్లో ఈ డబ్బుకు అసలైన వారసుడెవరో తీర్పు వెలువడనుంది.