మరో ఘోర ప్రమాదం: పర్వత శ్రేణులపై కుప్పకూలి.. పేలిపోయిన విమానం..!
కాబూల్: అమెరికాలోని లాస్ఏంజిలిస్ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆ దేశ స్టార్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు కోబె బ్రియాంట్, ఆయన కుమార్తె దుర్మరణం పాలైన దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే మరో విమాన ప్రమాదం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్లో ఓ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో విమానంలో 83 మంది వరకు ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లకు గట్టిపట్టు ఉన్న ఘజిని ప్రావిన్స్లోని డెహ్యాక్ జిల్లా పర్వత ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం ఈ దర్ఘటన చోటు చేసుకుంది. కుప్పకూలిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, ఆ కాస్సేపటికే పేలిపోయిందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియ రావాల్సి ఉంది. ప్రమాదం చోటు చేసుకున్న తీరుతెన్నులను బట్టి చూస్తే.. ఎవరూ ప్రాణాలతో మిగిలి ఉండే అవకాశం లేదని ఆప్ఘనిస్తాన్ మీడియా వెల్లడించింది.
అరియానా ఆఫ్ఘన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం సుమారు 83 మంది ప్రయాణికులతో ఈ మధ్యాహ్నం హెరాత్ నగరం నుంచి కాబూల్కు బయలుదేరింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. ఈ విమానం గంట తరువాత కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. మార్గమధ్యలో ఘజిని ప్రావిన్స్లోకి ప్రవేశించిన తరువాత విమానం ప్రమాదానికి గురైంది. డెహ్యాక్ జిల్లా పర్వత శ్రేణులపై కుప్పకూలింది.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. మృతుల సంఖ్య ఎంత అనేది కూడా అధికారికంగా తెలియ రావాల్సి ఉంది. విమానం నేలను తాకిన వెంటనే మంటలు చెలరేగడం, ఆ వెంటనే పేలిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల ప్రయాణికులెవరూ జీవించి ఉండటానికి అవకాశం లేదని అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం 1:10 నిమిషాలకు ఈ దుర్ఘటన సంభవించినట్లు ఘజిని ప్రావిన్స్ గవర్నర్ అరిఫ్ నూరి, ఇతర అధికారులు ధృవీకరించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో విమానం సుమారు 20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.