విద్యార్థి కాల్పులు: ఇద్దరి మృతి, 20 మంది బందీలు
మాస్కో: ఓ హైస్కూల్ విద్యార్థి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక టీచర్, పోలీసు అధికారి మృతి చెందారు. తరువాత తరగతి గదిలోకి ప్రవేశించి 20 మంది విద్యార్థులను నిర్బంధించాడు. కొద్ది రోజుల్లో వింటర్ ఒలింపిక్స్ జరగనుండగా సోమవారం చోటుచేసుకున్న ఘటన ఆందోళన కలిగింది.
ఉత్తర మాస్కోలోని ఓ పాఠశాల బయోలజీ క్లాస్ రూమ్లోకి పిస్టల్తో వచ్చిన విద్యార్థి భీతావహ వాతావరణాన్ని సృష్టించాడు. కాల్పుల్లో ముందుగా ఓ పోలీసు అధికారి చనిపోయినట్టు లైఫ్న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. తరగతి గదిలోకి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరపగా టీచర్ మృతి చెందారు.
క్లాసులో ఉన్న ఇరవై మంది విద్యార్థులు, ఒక టీచర్ను నిర్బంధించాడని రష్యా అంతరింగక భద్రతా మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఆండ్రీ ఫిలిప్చుక్ తెలిపారు. అగంతకుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. పరిస్థితి సద్దుమణిగిన తరువాత విద్యార్థులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు.
ఈ ఆపరేషన్లో ఒక పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. మరొక అధికారి ఆసుప్రతిలో చనిపోయినట్టు న్యూస్లైన్ పేర్కొంది. మాస్కోలోని స్కూల్ నెంబర్ 263లో ఈ ఘటన జరిగిందన్నారు. కాల్పులతో భయాందోళనకు గురైన డజన్లకొద్ది విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.