పాక్లో ఉన్నది నా ఆర్మీ, నా ప్రభుత్వం..భారత్తో సంబంధాలు కోరుకుంటున్నాం: ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్లో ప్రభుత్వం, ఆర్మీ రెండూ ఒకే కాగితం పై ఉన్నాయని భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నాయని ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తను భారత్లో పర్యటించినప్పుడల్లా పాకిస్తాన్ ఆర్మీ ఎప్పటికీ శాంతిని కోరుకోదని తనతో చెప్పేవారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కానీ ఇప్పుడు నడుస్తున్నది తన ప్రభుత్వం అని తన ఆర్మీ అని తన పార్టీలని చెప్పిన ఇమ్రాన్ అంతా భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నాయన్నారు. కర్తాపూర్ కారిడార్కు శంకుస్థాపన చేసిన అనంతరం ఇమ్రాన్ ఖాన్ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ఒక్క అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కు పడ్డాయి
"గత 70 ఏళ్లుగా ఒకరి పై ఒకరం కత్తులు దూసుకున్నాం. మాటల యుద్ధానికి దిగాం. భారత్ పాక్ తప్పులను వేలిత్తి చూపడం... పాకిస్తాన్ భారత్ తప్పులను వేలెత్తి చూపడం జరిగాయి.రెండు వైపుల నుంచి తప్పులు దొర్లాయి. ఇలా నిందారోపణలతో ఇంకా ఎంతకాలం వెల్లదీస్తాం. ఒక అడుగు ముందుకు పడిందంటే రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయి"అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మానవత్వంతో వ్యవహరిస్తేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
మానవీయ కోణంలోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం
కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని ఇరు దేశాలు భావిస్తున్న నేపథ్యంలో మానవీయ కోణంలో చర్చించి దాన్ని పరిష్కరించలేమా అని ఇమ్రాన్ ప్రశ్నించారు. అది కచ్చితంగా జరుగుతుందని దానికి గ్యారెంటీ ఇస్తానని చెప్పారు. దాన్ని పరిష్కారించాలన్న పట్టుదల ఉండాలని అన్నారు. శాంతి చర్చల ద్వారా వెళితే రెండు దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్న ఇమ్రాన్ ఖాన్... ఇరుదేశాల మధ్య ఉన్న విబేధాలను పక్కన బెట్టి సరిహద్దుల్లో శాంతికోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
బద్ధ శతృవులైన జర్మనీ ఫ్రాన్స్ కలిసినప్పుడు భారత్ పాక్ ఎందుకు కలవలేవు..?
ఫ్రాన్స్ జర్మనీల గురించి ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇరుదేశాలు శతృవులుగా ఉన్నాయన్నారు. యుద్ధం సమయంలో రెండు దేశాల్లో చాలా మంది ప్రజలు చనిపోయారని చెప్పిన ఇమ్రాన్ ఖాన్.. ఆ తర్వాత రెండు దేశాలు ఒక్కటైన విషయాన్ని గుర్తు చేశారు. ఫ్రాన్స్ జర్మనీ దేశాలు కలిసి పనిచేస్తున్నప్పుడు భారత్ పాకిస్తాన్లు కలవలేవా అంటూ ప్రశ్నించారు.ఇప్పుడు వారి సరిహద్దులు ఎప్పుడూ తెరుచుకునే ఉండటమే కాదు మంచి వాణిజ్య సంబంధాలు కూడా రెండు దేశాల మధ్య నడుస్తున్నాయని ఇమ్రాన్ అన్నారు. ద్వేషాన్ని వీడటంతోనే కలిసిపోయారని అదే దారిలో భారత్ పాక్లు నడవాలని ఇమ్రాన్ ఖాన్ ఆకాంక్షించారు. రెండు దేశాల సమస్యలతో ఎంతో మంది ప్రజలు మృతి చెందారని చెప్పిన ఇమ్రాన్ ఖాన్... ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు శాంతికోసం సరైన పద్ధతిలో నిజాయితీగా చర్చలు జరగలేదన్నారు.