దేవయానిపై మళ్లీ అరెస్టు వారెంట్, ఇబ్బందేనని ఖుర్షీద్
వాషింగ్టన్: భారత రాయబారి దేవయానిని అమెరికా వదలడం లేదు. వీసా మోసం కేసులో దేవయానిపై నమోదు చేసిన అభియోగాలను మూడు రోజుల కిందటే అమెరికా కోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా అధికారులు మరోసారి అభియోగాలు నమోదు చేశారు. మరోసారి ఆమెపై అరెస్టు వారెంటు జారీ చేశారు.
దీంతో, ప్రస్తుతం భారత్లో ఉన్న దేవయాని అమెరికాలో అడుగు పెడితే ఆమె అరెస్టు తప్పదు. దీంతో, తాజా పరిణామంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవయానికి దౌత్య రక్షణ ఉందని, ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని రెండు రోజుల కిందట అమెరికా అధికారులు స్పష్టం చేశారు.
కానీ, అమెరికా ప్రాసిక్యూటర్లు ఆమెను తప్పుపడుతూ తాజాగా 21 పేజీల చార్జిసీటును దాఖలు చేశారు. ఆమెకు అరెస్టు వారెంటు జారీ చేశారు. తన ఇంట్లో పని మనిషికి తక్కువ వేతనం చెల్లించడం ద్వారా అక్రమాలకు పాల్పడిందని, ఆమె దోపిడీకి పాల్పడిందని ఆరోపించింది. ఈ మేరకు భా రత్కు చెందిన అమెరికా అటార్నీ ప్రీత్ భరారా అమెరికా జిల్లా కోర్టు జడ్జి విలియమ్ పాలేకు లేఖను అందజేశారు.
అయితే, దేవయానికి దౌత్య రక్షణ ఉందంటూ కేసును కోర్టు కొట్టివేసిన తర్వాత మళ్లీ ఆమెపై చార్జిషీటు దాఖలు చేయడంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వివాదానికి సంబంధించి తదుపరి ఎటువంటి చర్య తీసుకున్నా భారత్, అమెరికా వ్యూహాత్మక సంబంధాలపై ప్రభావం చూపుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. న్యాయస్థానంలో ఆమెకు ఊరట లభించడంపై రెండు రోజుల క్రితమే అమెరికా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
దేవయానికి మళ్లీ అమెరికా అరెస్టు వారెంట్ జారీ చేయడంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆదివారం స్పందించారు. ఇది చికాకు కలిగించేదన్నారు. సమస్య పరిష్కారానికి ముగింపు పలకాలని ఆయన అభిప్రాయపడ్డారు.