హత్య కేసు: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
లాహోర్: పాకిస్ధాన్ మాజీ అధ్యక్షడు పర్వేజ్ ముషారఫ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేస్తూ గురువారం ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది. లాల్ మసీదు ప్రధాన గురువు అబ్దుల్ రషీద్ ఘాజి, అతడి తల్లి హత్య కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకాకుండా ప్రతిసారి తప్పించుకుంటున్నారని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది.
తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. 2007 నుంచి కూడా ముషారఫ్ కోర్టుకు హాజరుకావడం లేదని వెంటనే అతడిని అదుపులోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇచ్చేలా ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్ను జిల్లా న్యాయస్ధానం తిరస్కరించింది.
71 ఏళ్ల ముషారఫ్ తన కూతురుతో కలిసి కరాచీలో నివసిస్తున్నారు. 2007లో లాల్ మసీదు మత పెద్ద అబ్దుల్ రషీద్ ఘాజి, అతడి తల్లి హత్యలో ముషారఫ్ ప్రమేయం ఉందని కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆరోగ్యం, సెక్యూరిటీ కారణాల వల్ల కోర్టుకు హాజరు నుంచి తప్పించుకుంటున్నారు.
దీంతో పాటు పాకిస్ధాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను హత్య చేసిన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అయన ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. 2007 డిసెంబర్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం రావల్పిండికి వచ్చిన బెనజీర్ భుట్టో తాలిబన్ల ఆత్మాహుతి దాడిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. తాలిబన్ ఉగ్రవాద సంస్థ అధిపతి బెతుల్లా మెహసూద్ను అమెరికా దళాలు 2009లో మట్టుపెట్టాయి.