నీరవ్ మోడీకి షాక్: ఈడీ అభ్యర్థనపై అరెస్టు వారెంట్ జారీ చేసిన లండన్ కోర్టు
లండన్ : ఆర్థిక నేరగాడు.. లండన్లో తలదాచుకుంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి అక్కడి కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. భారత్నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అభ్యర్థన మేరకు నీరవ్ మోడీకి లండన్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. నీరవ్ మోడీ భారత్లో మనీలాండరింగ్కు పాల్పడి భారత్ నుంచి పారిపోయి లండన్లో తలదాచుకుంటున్నాడని ఈడీ అధికారులు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
త్వరలోనే అరెస్టు కానున్న నీరవ్ మోడీ
ఇదిలా ఉంటే నీరవ్ మోడీ ఈ మధ్యే లండన్ వీధుల్లో తిరుగుతూ ఓ అంతర్జాతీయ మీడియా కంటికి చిక్కాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13వేల కోట్లు మేరా కుచ్చుటోపీ పెట్టి లండన్కు పారిపోయాడు నీరవ్ మోడీ. వెస్ట్మిన్స్టర్ మెజెస్ట్రేట్ కోర్టు నీరవ్ మోడీపై అరెస్టు వారెంట్ ఇచ్చినట్లు తమకు సమాచారం అందిందని ఈడీ అధికారులు తెలిపారు. త్వరలోనే స్థానిక పోలీసులు అతన్ని అరెస్టు చేసి అక్కడి పోలీస్ స్టేషన్లో ఉంచుతారని వెల్లడించారు. అయితే నీరవ్ మోడీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారని ఆసమయంలో కోర్టు ముందుకు హాజరవుతారని చెప్పిన ఈడీ అధికారులు ఇక అక్కడి నుంచి భారత్కు రప్పించే ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు.
విజయ్ మాల్యా విషయంలోనూ ఈడీ సక్సెస్
ఇక మరో ఆర్థిక నేరగాడు లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా విషయంలో కూడా ఇదే పద్ధతిని ఇంప్లిమెంట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ముందుగా లండన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారని ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారమే నడుచుకుని మాల్యాను భారత్కు రప్పించే విషయంలో దాదాపు విజయవంతం అయ్యామని ఈడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కోర్టులో ఆయన కేసు చివరి దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మాల్యా వివిధ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు ఎగనామం బెట్టి 2016 మార్చిలో భారత్నుంచి పారిపోయి లండన్లో ఆశ్రయం పొందుతున్నాడు.
టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే: తెలంగాణలో కొనసాగుతున్న కారుజోరు...దక్షిణాదిలో పెరిగి బీజేపీ ఓటుశాతం
భారత అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సాజిద్ జావీద్
నీరవ్ మోడీని భారత్కు అప్పగించాలన్న భారత్ అభ్యర్థన మేరకు యూకే హోం సెక్రటరీ సాజిద్ జావీద్ సానుకూలంగా స్పందించారని ...ఈ మేరకు కోర్టుకు విషయాన్ని తెలిపినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నీరవ్ మోడీ ఓ ఖరీదైన అపార్టుమెంటులో నివసిస్తూ అక్కడే వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లు స్థానిక పత్రిక కథనం ప్రచురించింది. ఇక మనీలాండరింగ్ కేసులో మోడీపై సీబీఐ, ఈడీలు ఛార్జిషీట్లు దాఖలు చేశాయి. తమ దేశాల్లో నీరవ్ మోడీ కనిపిస్తే వెంటనే అరెస్టు చేయాలంటూ రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేసింది భారత ప్రభుత్వం.