250 మంది మృతి: సైనిక తిరుగుబాటు విఫలం
ఇస్తాంబుల్ : సైనిక తిరుగుబాటును తిప్పికొట్టినట్లు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా ప్రభుత్వ పునరుద్ధరణ జరిగిందని టర్కీ ప్రభుత్వం చెప్పింది. దేశంలోని పలు నగరాల్లో సైన్యం సృష్టించిన బీభత్సం అనంతరం దేశాధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇస్లాంబుల్లో తన మద్దతుదార్లను ఉద్దేశించి మాట్లాడారు.
తన ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా అధికారంలో ఉందని చెప్పారు. ప్రజలు అధికారం కట్టబెట్టిన ప్రభుత్వం విధి నిర్వహణలో ఉన్నట్లు తెలిపారు. ఆయన మాటలకు ప్రతిస్పందనగా అక్కడ హాజరైన జనం ''టర్కీ మిమ్మల్ని చూసి గర్విస్తోంది'' అని నినాదాలు చేశారు. "నేనున్నాను. మీతోనే ఉన్నాను. దీన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను" అని ఎర్డోగాన్ అన్నారు.
టర్కీలో సైనిక తిరుగుబాటుకు ఐదు కారణాలు
ట్యాంకులతో సైనికులు వీథుల్లోకి వచ్చారు. వారిని అడ్డుకునేందుకు ఎర్డోగాన్ మద్దతుదార్లు, ప్రజలు భారీగా తరలివచ్చారు. టర్కీ రాజధాని అంకారాలోని ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునేందుకు సైన్యం హెలికాప్టర్ల ద్వారా కాల్పులు జరిపింది. టర్కీ ప్రభుత్వ కూల్చివేతను నిరసిస్తున్న ప్రజలపైకి కూడా సైనికులు కాల్పులు జరిపారు. వారిపైనుంచి ట్యాంకర్లను నడుపుతూ తొక్కేసినట్లు సోషల్ మీడియాలో పొటోలు కనిపించాయి.
ఈ ఘటనలో 250 మంది మరణించారని కొత్తగా నియమితులైన జనరల్ స్టాఫ్ యాక్టింగ్ చీఫ్ జనరల్ ఉమిత్ దుండార్ చెప్పారు. పార్లమెంటుపై బాంబు దాడి ఘటనలో ఓ ఎంపీ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. శనివారం ఉదయం టర్కీ అధికారులు ఓ ప్రకటనలో తిరుగుబాటును అణచివేసినట్లు తెలిపారు.
తిరుగుబాటు నేతలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను టర్కీ యుద్ధ విమానం కూల్చేసిందని అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ మీడియా కూడా తన కార్యక్రమాలను పునరుద్ధరించింది.1.500 మంది సైనిక అధికారులను దేశవ్యాప్తంగా అరెస్టు చేసినట్లు దుండార్ చెప్పారు. 1,100 మంది గాయపడినట్లు తెలిపారు. 200 మంది సైనికులు లొంగిపోయిట్లు ఎర్డోగాన్ చెప్పారు.