పేలుళ్ల మధ్య దేశాధ్యక్షుడి ప్రమాణం.. తల తెగిపడినా భయపడననంటూ.. అఫ్గాన్లో హైడ్రామా
అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తాలిబన్లు.. సొంతదేశ ప్రభుత్వంపై మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అఫ్గానిస్తాన్ అధ్యక్ష ఎన్నికల్లో అష్రఫ్ ఘని విజయాన్ని గుర్తించబోమన్న తాలిబన్లు.. ఏకంగా ప్రమాణ స్వీకారాన్ని చెగడొట్టే ప్రయత్నం చేశారు. తానేమీ తక్కువ తినలేదంటూ.. బుల్లెట్ ప్రూఫ్ ధరించకుండానే ఘని జనంలోకి వచ్చారు. మరోవైపు ఘనీ వైరివర్గం సమాంతర పాలనకు సిద్ధమైంది. అఫ్గాన్ అధ్యక్షుడి ప్రమాణం సందర్భంగా సోమవారం కాబుల్ సిటీలో చోటుచేసుకున్న దృశ్యాలివి.
Recommended Video
గత సెప్టెంబర్ లో అఫ్గాన్ ఎన్నికలు జరిగాయి. ఓటిం శాతం తక్కువగానే నమోదయినప్పటికీ అష్రఫ్ ఘనినే రెండోసారి కూడా గెలుపొందారు. అయితే ఆయన విజయాన్ని గుర్తించబోమంని తాలిబన్లు ప్రకటన చేశారు. ఈలోపే తాలిబన్లు, అమెరికా సైన్యం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. తర్వాతి దశగా అఫ్గాన్ ప్రభుత్వంతో తాలిబన్లు చర్చలు జరపాల్సి ఉంది. కానీ ఘని ఉంటే చర్చలక రాబోమని తాలిబన్ నేతలు తెగేసి చెప్పారు.
సోమవారం నాటి ప్రమాణస్వీకారాన్ని తాలిబన్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభా వేదికకు కొద్ది దూరంలో రెండు శక్తిమంతమైన బాంబుల్ని పేల్చడంతో జనం హాహాకారాలు చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సిఉంది. తన ఉపన్యాసంలో పేలుళ్ల అంశాన్ని ప్రస్తావించిన ఘని.. అఫ్గాన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని.. తల తెగిపడినా ప్రజల కోసమే పనిచేస్తానంటూ భావోద్వేగంగా ప్రసంగించారు.
అఫ్గాన్ ప్రెసిడెంట్ గా ఘనీ ఎన్నిక కావడం ఇది రెండోసారి. అయితే అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అసలీ ఎన్నికలే చెల్లవని ఘని ప్రత్యర్థి అబ్దుల్లా ఆరోపిస్తున్నారు. దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజే.. మరోవేదికపైనుంచి అబ్దుల్లా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఘనికి మద్దతు పలకాలని అబ్దుల్లాను ఒప్పించేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.