మాస్క్ షేప్లో ఉల్క: రెండురోజుల్లో భూమికి అత్యంత సమీపంగా: ఇప్పుడున్న కరోనా చాలదన్నట్లుగా
న్యూయార్క్: అంతుచిక్కని, అంతులేని రహస్యాలకు నిలయమైన అంతరిక్షంలో మరో రెండు రోజుల్లో ఓ అద్భుతం చోటు చేసుకోబోతోంది. అంతరిక్షంలో దారి తప్పిన ఓ ఉల్క భూమికి అత్యంత సమీపానికి దూసుకుని రాబోతోంది. దీని పేరు అస్టరాయిడ్ 52768. 1998లో దీన్ని తొలిసారిగా గుర్తించారు. అందుకే 1998 ఓఆర్2గా కూడా దీన్ని పిలుస్తారు. సాధారణ ఉల్కలతో పోల్చుకుంటే దీనికి కొంత ప్రాధాన్యత ఉందంటున్నారు అంతరిక్ష పరిశోధకులు. మనం ధరించే మాస్క్ షేప్లో ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఈ ఉల్క.
Recommended Video
మళ్లీ వార్తల్లోకి ఎక్కిన తబ్లిగి జమాతీలు: సాహస నిర్ణయం.. పుణ్యకార్యంగా ప్లాస్మా దానం: ఏపీ, తెలంగాణలో
ఈ నెల 29వ తేదీన
ఈ నెల 29వ తేదీన అంటే బుధవారం నాడు ఈ ఉల్క భూమికి అతి సమీపానికి రాబోతోంది ఇది. ఎంత సమీపానికి అంటే.. ఈ ఉల్క భూమికి సమీపించిన సమయంలో ఈ రెండింటి మధ్య ఉండే దూరం 39,08,791 కిలోమీటర్లు. లెక్కల్లో చూసుకుంటే.. లక్షల కిలోమీటర్ల దూరం అని అనిపిస్తున్నప్పటికీ.. అంతరిక్ష పరిభాషలో దీన్ని అతి సమీపంగా భావిస్తుంటారు ఖగోళ శాస్త్రవేత్తలు..అంతరిక్ష పరిశోధకులు. 1998లో తొలిసారి శాస్త్రవేత్త కంట్లో పడిన ఈ ఉల్క.. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. మూడు దశాబ్దాల తరువాత తొలిసారిగా మళ్లీ భూగోళం సమీపానికి చేరుకుంటోంది.
గంటకు 19 వేల మైళ్ల వేగంతో..
గంటకు 19 వేల 461 మైళ్ల వేగంతో ఈ అస్టరాయిడ్ పరిభ్రమిస్తున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వ్యాసార్థం ఉన్న ఈ ఉల్క ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఇది తన చుట్టూ తాను తిరుగుతోందని వెల్లడించారు. ఈ అస్టరాయిడ్ మనుషులు ముఖానికి ధరించే మాస్క్లను పోలి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇదివరకు ఇలాాంటి ఉల్కలను ఎప్పుడూ చూడలేదని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. ఈ ఉల్కకు సంబంధించిన ఫొటో ఒకదాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ ఉల్క పునర్దర్శనం మళ్లీ 2079లోనే..
ఈ నెల 18వ తేదీన ప్యూర్టోరికోలోని అరెసిబో రాడార్ అబ్జర్వేటరీ నుంచి తీసిన ఫొటో అది. 1998లో తొలిసారిగా కనిపించిన సమయంలో ఈ ఉల్క భూమికి 6.3 మిలియన్ల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లింది. ఈ సారి మాత్రం మరింత సమీపానికి రాబోతోంది. ఈ అస్టరాయిడ్ వల్ల భూమికి గానీ, మానవాళికి గానీ ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు కనిపించే ఈ ఉల్క మళ్లీ 2079లోనే సాధ్యపడుతుందని అంటున్నారు. మళ్లీ 2079లో భూగోళానికి సమీపంలో దూసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సారి అత్యంత సమీపంలోకి రాబోతుండటం వల్ల దాని గురించి అధ్యయనం చేయడానికి అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ ఉల్క వల్ల ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ..
ఈ ఉల్క భౌతికంగా భూమికి గానీ, మానవాళికి గానీ ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నప్పటికీ.. మూఢనమ్మకాలను నమ్ముకొన్న కొంతమంది ప్రజల్లో మాత్రం భయాందోళనలు మాత్రం వ్యక్తమౌతున్నాయి. చంద్రుడు బుధ గ్రహంలో ప్రవేశించిన సమయంలో కరోనా వైరస్ పుట్టుకొచ్చిందని, జూన్ 25వ తేదీ నాటికి ఈ వైరస్ అంతరిక్షంలోకి వెళ్లి మటుమాయం అవుతుందనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో కొత్తగా ఈ ఉల్క భూమికి దగ్గరగా దూసుకుని రావడం, పైగా మాస్క్ను పోలిన విధంగా ఈ ఉల్క ఉండటం వల్ల సహజంగానే కొంతమందిలో ఇంకేం వైరస్ను తీసుకొస్తోందననే భయాందోళనలు నెలకొన్నాయి.