భూమికి అతి సమీపంలో ప్రయాణించనున్న ఆస్టరాయిడ్
హ్యూస్టన్: శుక్రవారం (09-02-2018) ఓ ఆస్టరాయిడ్ భూమికి అతి సమీపానికి రానుంది. 50 నుంచి 130 ఫీట్ల వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్ భూమికి 39వేల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది. ఈ దూరం భూమికి, చంద్రుడికి మధ్య దూరంలో అయిదో వంతు ఉంటుంది.
అంత తక్కువ ధూరంలో భూమి సమీపం నుంచి ప్రయాణిస్తుంది. నాసా ఆధ్వర్యంలో నడుస్తున్న సీఎస్ఎస్ (కాటాలినా స్కై సర్వే) ఫిబ్రవరి 4వ తేదీన రెండు ఆస్టరాయిడ్లను గుర్తించారు.
ఫిబ్రవరి 6వ తేదీన స్పెస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగించిన రోజు చిన్న ఆస్టరాయిడ్ ప్రయాణించింది. దీని పేరును 2018 సీసీగా నామకరణం చేశారు. శుక్రవారం పరిమాణంలో పెద్దగా ఉండే ఆస్టరాయిడ్ (పేరు ఆస్టరాయిడ్ 2018 సీబీ) భూమికి సమీపంలో ప్రయాణిస్తుంది.
ఈ ఆస్డరాయిడ్ ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ (ఈఎస్టీ) ప్రకారం ఫిబ్రవరి 9న సాయంత్రం గం.5.30 నిమిషాలకు ప్రయాణించనుంది. ఈ ఆస్టరాయిడ్ పరిమాణంలో పెద్దగా ఉండటమేకాదు. 2018 సీసీ ఆస్టరాయిడ్ కంటే భూమికి దగ్గరగా ప్రయాణిస్తుంది.
భూమికి అతి దగ్గరగా 39వేల మైళ్ల (64 వేల కిలోమీటర్ల) దూరం నుంచి అది వెళ్లనుంది. దీనివల్ల భూమికి వచ్చిన ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది 15 నుంచి 30 మీటర్ల పొడువున్నట్లు నాసా వెల్లడించింది. ఇక, మన భారత కాలమానం ప్రకారం శనివారం వేకువజామున నాలుగు గంటలకు భూమిని దాటి వెళ్లనుంది.