ఆ వ్యాక్సిన్లో కొన్ని పొరపాట్లు జరిగాయి.. బాంబు పేల్చిన ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ..!
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కనుగొనేందుకు అన్ని ప్రయత్నాలు ఆయా దేశాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్ని దేశాలు క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసి త్వరలోనే ఆయా ప్రభుత్వాల ఆమోదంతో వ్యాక్సిన్ను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 60.05 మిలియన్ ఉండగా మృతుల సంఖ్య 1.4 మిలియన్గా ఉంది. ఇక ఏడాది తర్వాత వ్యాక్సిన్ వస్తుందన్న సంతోషం ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్లు సిద్ధమైపోయి ఇక సరఫరా చేసేందుకు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.
Recommended Video
వ్యాక్సిన్ పనిచేస్తోందంటూ కొద్ది రోజుల క్రితమే...
కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడంలో ముందువరసలో ఉంది ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ. ఆస్ట్రాజెన్కాతో కలిసి ఈ వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రయోగం సందర్భంగా ప్రాథమిక తప్పులు దొర్లినట్లు ఆస్ట్రాజెన్కా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలు ఒప్పుకున్నాయి. తాము తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ కచ్చితత్వంతో పనిచేస్తోందని ప్రకటించిన కొద్దిరోజులకే ప్రాథమిక తప్పులున్నాయంటూ చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే రెండు ఫుల్ డోసులు తీసుకున్న వాలంటీర్లకంటే తక్కువ డోసు తీసుకున్న వాలంటీర్ల పరిస్థితి మెరుగ్గా ఉండటం వీరినే ఆశ్చర్యానికి గురిచేసింది.
డోసులు తీసుకున్న వారిలో కనిపించని కచ్చితత్వం
తక్కువ డోసులు తీసుకున్న వారిలో 90 శాతం కచ్చితత్వంతో వ్యాక్సిన పనిచేస్తోందని ఆస్ట్రాజెన్కా పేర్కొంది. అదే రెండు డోసులు తీసుకున్న వారిలో 60శాతం కచ్చితత్వం మాత్రమే కనిపిస్తోందని సంస్థ వివరించింది. ఇక రెండింటిని కలిపి చూస్తే 70 శాతం కచ్చితత్వం ఉందని చెప్పొచ్చని ఆస్ట్రాజెన్కా పేర్కొంది. ఇక సంస్థ నుంచి వచ్చిన నివేదికను పరిశీలించిన నిపుణులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారని ఆస్ట్రాజెన్కా వివరించింది.ఇక సోమవారం ప్రకటించిన ఫలితాలు యూకే, బ్రెజిల్ దేశాల నుంచి తీసిన రిపోర్ట్ అని ఆస్ట్రాజెన్కా వెల్లడించింది.
వచ్చేవారంలో గుజరాత్ హాస్పిటల్లో..
ఇదిలా ఉంటే మనదేశానికి చెందిన భారత్ బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ను అహ్మదాబాదులోని సోలా సివిల్ హాస్పిటల్లో ప్రయోగించనున్నట్లు గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ చెప్పారు. హాస్పిటల్కు 500 డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు. ప్రయోగంకు ముందు వాటిని ఎలా ఇవ్వాలనేదానిపై వైద్యులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి నిపుణులు శిక్షణ ఇస్తారని వెల్లడించారు. వచ్చేవారంలో ఈ ప్రయోగం ప్రారంభమవుతుందని నితిన్ పటేల్ చెప్పారు.ఇందుకోసం పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి వాలంటీర్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. కోవాగ్జిన్ హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లు సంయుక్తంగా తయారు చేశాయి.