ఈ వారంలోనే ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లు అందుబాటులోకి: ముహూర్తం ఫిక్స్
లండన్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్లు ఇక త్వరలోనే అందుబాటులోకి రాబోతోన్నాయి. డిసెంబర్ 1వ తేదీ నాటికి రెండు ప్రధాన వ్యాక్సిన్లను వినియోగించడానికి అనుమతులు లభించనున్నాయి. ఈ దిశగా బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనాను రూపుమాపడానికి ఉద్దేశించిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, ఫైజర్- బయో ఎన్టెక్ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్లను డిసెంబర్ తొలివారంలోనే వినియోగానికి తీసుకుని రాబోతున్నామని బ్రిటన్ ఆరోగ్యశాఖ కార్యదర్శి మ్యాట్ హ్యాన్కాక్ తెలిపారు.
Recommended Video
కరోనా జన్మ రహస్యంపై కొత్త గుట్టును విప్పిన చైనా వైరాలజిస్ట్: ఆ ల్యాబ్తో నో లింక్: గబ్బిలాలపై
దీనికి సంబంధించిన అనుమతులను ఈ వారంలోనే జారీ చేస్తామని, డిసెంబర్ 1వ తేదీ లేదా మొదటి వారం నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకుని రావడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులకి తేవడానికి సంసిద్ధంగా ఉండాలంటూ నేషనల్ హెల్త్ సర్వీస్ను తమ ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. వ్యాక్సిన్ను వీలైనంత త్వరగా ప్రజలకు అందించడానికి హెల్త్ సర్వీస్ ఏర్పాట్లన్నీ చేసుకున్నట్లు హ్యాన్కాక్ తెలిపారు. బీబీసీ రేడియోకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
వ్యాక్సిన్ను వినియోగంలోకి తీసుకుని రావడానికి అవసరమైన అనుమతులను జారీ చేయడానికి మెడిసిన్స్ అండ్ హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్) ఎంత సమయమైనా తీసుకోవచ్చని, ప్రభుత్వంతో సంబంధం లేని స్వతంత్ర సంస్థ కావడం వల్ల అనుమతుల కోసం ఎదురు చూడట్లేదని పేర్కొన్నారు. కిందటి వారమే బ్రిటన్ ప్రభుత్వం ఎంహెచ్ఆర్ఎను ఫైజర్ టీకా సామర్థ్యాన్ని పరీక్షించాలని విజ్ఞప్తి చేసింది. బ్రిటన్ ఇప్పటికే 40 మిలియన్ల డోసులను తెప్పించుకోబోతోంది.
వీటిలో 10 మిలియన్లు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అనుమతులు లభించి, అన్నీ సజావుగా సాగితే డిసెంబర్ ముగిసే నాటికి బ్రిటన్లో అయిదు కోట్ల మందికి వ్యాక్సిన్ అందే సూచనలు కనిపిస్తున్నాయి. క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా ఆంక్షలను సడలించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, అవి అమల్లోకి వస్తాయని తాను ఆశిస్తున్నట్లు హ్యాన్కాక్ చెప్పారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ త్వరలోనే పార్లమెంట్లో ఓ ప్రకటన చేస్తారని అన్నారు.