ఉగ్రవాదం: పేలుడులో 10 మంది దుర్మరణం
కైరో: ఈజిప్టులో పేలుడు జరిగి 10 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి సైన్యం ప్రయత్నిస్తున్నది.
ఈజిప్టు రాజధాని కైరోకు సమీపంలోని గిజా ప్రావిన్స్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఉగ్రవాదుల స్థావరం ఉందని అధికారులు సమాచారం సేకరించారు. ఉగ్రవాదుల మీద దాడి చెయ్యడానికి వెళ్లిన సమయంలో ఈ పేలుడు జరిగింది.
ఈ పేలుడులో ఏడుగురు పోలీసులతో సహ 10 మంది దుర్మరణం చెందారని అధికారులు చెప్పారు. పోలీసులు, సైన్యం మీద ఉగ్రవాదులు పేలుడు పదర్థాలతో దాడులు చేశారని అధికారులు అంటున్నారు. అయితే అపార్ట్ మెంట్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నారు.
వారిని అంతం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. గత రెండేళ్లుగా ఈజిప్టులో ప్రభుత్వ వ్యతిరేక దాడులు పెరిగిపోతున్నాయని, వందలాది మంది సైనికులు, పోలీసులు చనిపోయారని, ఉగ్రవాదులను అంతం చేస్తామని ఈజిప్టు సైనిక విభాగం అధికారులు తెలిపారు.