మ్యాచ్ చూస్తూ కొట్టుకున్న ఫ్యాన్స్ - 127 మందికి పైగా దుర్మరణం..!!
జకర్తా: ఇండోనేసియా దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తరువాత అభిమానుల మధ్య చోటు చేసుకున్న వివాదం.. పరస్పర దాడులకు దారి తీసింది. ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు ప్రాణాలు పోయేంతలా కొట్టుకున్నారు. ఈ ఘటనలో 127 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘర్షణ తరువాత చోటు చేసుకున్న తొక్కిసలాటలో కూడా చాలామంది గాయాలపాలయ్యారు. కొస ప్రాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇండోనేసియాలో..
మన పొరుగునే ఉన్న ఇండోనేసియాలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘర్షణ సంభవించింది. శనివారం రాత్రి జావా తూర్పు ప్రాంతం మలంగ్ రీజెర్సీలో గల కంజూరుహన్ స్టేడియంలో ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాటైంది. బీఆర్ఐ లిగా 1 టోర్నమెంట్లో భాగంగా ఈ మ్యాచ్ను నిర్వహించారు. అరెమా ఫుట్బాల్ క్లబ్-పెర్సెబయ సురబయ టైటిల్ కోసం హోరాహోరీగా తల పడ్డాయి. పెర్సెబయ చేతిలో అరెమా ఎఫ్సీ ఓటమి చవి చూసింది. 3-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
ఓటమిని జీర్ణించుకోలేక..
ఈ ఓటమిని అరెమా ఎఫ్సీ అభిమానులు జీర్ణించుకోలేపోయారు. తమ ఆగ్రహావేశాలు, భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు. విజయోత్సవాలను జరుపుకొంటోన్న పెర్సెబయ సురబయ అభిమానులపై దాడికి దిగారు. పిచ్ మీదికి దూసుకెళ్లారు. మ్యాచ్ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ వివాదం కాస్త ఘర్షణగా మారింది. బాహాబాహికి దిగారు. చేతికి అందిన వస్తువులతో దాడి చేసుకున్నారు.
టియర్ గ్యాస్..
సమాచారం అందుకున్న కుంజూరుహన్, ఈస్ట్ జావా ప్రావిన్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అభిమానులను కట్టడి చేయడానికి లాఠీఛార్జ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో టియర్ గ్యాస్ను ప్రయోగించారు. స్టేడియం లోపలే 34 మంది దుర్మరణం పాలయ్యారు. ఫెన్సింగులను దాటుకుని ప్రేక్షకులు బయటికి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తొక్కిసలాటలో..
దాడుల అనంతరం స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. బయటికి వెళ్లిపోవడానికి ప్రేక్షకులు ఒక్కసారిగా ద్వారాల చొచ్చుకుని రావడంతో చాలామంది కిందపడ్డారు. నలిగిపోయారు. తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని కుంజురుహన్ సహా ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరికొంతమంది మరణించారు. స్టేడియం లోపల 34 మంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 90 మంది వరకు మృతిచెందినట్లు ఈస్ట్ జావా ప్రావిన్స్ పోలీస్ కమిషనర్ నికొ అఫింటా తెలిపారు.
సమగ్ర దర్యాప్తు..
ఈ ఘటన పట్ల ఇండోనేసియా ఫుట్బాల్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది. సమగ్ర దర్యాప్తునకు ఇండోనేసియా ప్రభుత్వం ఆదేశించింది. లోపం ఎక్కడ చోటు చేసుకుందనే విషయంపై ఆరా తీస్తున్నామని పోలీసులు వెల్లడించారు.