గుర్తింపు కార్డులు చూసి..బస్సు నుంచి కిందికి దించి! యథేచ్ఛగా కాల్పులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ మరోసారి రక్తమోడింది. కరాచి-గ్వాదర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ లోని ఒర్మారా ప్రాంతంలోని మక్రాన్ కోస్టల్ జాతీయ రహదారిపై సాయుధులైన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కరాచీ వైపునకు వెళ్తోన్న ఆరు బస్సులను అటకాయించారు. ప్రయాణికుల వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలించారు.
ఈ ఆరు బస్సుల నుంచి ఎంపిక చేసిన 16 మంది ప్రయాణికులను కిందికి దించారు. వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 14 మంది అక్కడిక్కడే మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. సుమారు 20 మంది వరకు సాయుధులు తమపై కాల్పులు జరిపి ఉంటారని క్షతగాత్రులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తామే ఈ దురాగతానికి పాల్పడినట్లు ఇప్పటిదాకా ఏ ఉగ్రవాద సంస్థ గానీ, అతివాదులు గానీ ప్రకటించుకోలేదు. ఆ ఘటనపై ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.
బంగాళాదుంపల సంచిలో ఐఈడీ బాంబు: భారీ పేలుడు: 16 మంది దుర్మరణం
బలూచిస్తాన్ ప్రావిన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు హింసాత్మక ఘటనలకు పాల్పడటం నెలరోజుల్లో ఇది రెండోసారి. ఇదివరకు క్వెట్టా సమీపంలోని ఓ కూరగాయల మార్కెట్ లో షిస్తే సామాజిక వర్గానికి చెందిన ముస్లిం చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, బాంబు పేలుడు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 17 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు.