కెన్యా యూనివర్సిటీలో ఉగ్రవాదుల దాడి: 150 మంది మృతి
నైరోబీ: కెన్యాలోని గరిస్సా యూనివర్సిటీపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. అందులో విద్యార్ధులు, యూనివర్సిటీ సిబ్బంది గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మొదట యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు గేట్ వద్ద ఉన్న ఇద్దరు గార్డులను కాల్చి వేశారు. ఆ తర్వాత యూనివర్సిటీలోని హాస్టల్స్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఉదయం 5.30లకు ఉగ్రవాదులు యూనివర్సిటీలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
యూనివర్సిటీలో మొత్తం 887 మంది విద్యార్ధులు ఉన్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న విషయం తెలుసుకున్న కెన్యా భద్రతా దళాలు యూనివర్సిటీని చుట్టిముట్టాయి. యూనివర్సిటీలోని కొంత మంది విద్యార్ధులు ఉగ్రవాదులు చేతిలో బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది.
యూనివర్సిటీలో జరుగుతున్న కాల్పుల ఘటనకు సంబంధించి సోమాలియాకు చెందిన ఉగ్రవాద సంస్ధ అల్ షబబ్ తామే బాధ్యులమంటూ ప్రకటించింది. 2013లో కూడా కెన్యా రాజధాని నైరోబీలో ఓ షాపింగ్ మాల్పై జరిగిన దాడిలో ఈ ఉగ్రవాదులే మారణకాండ సృష్టించారు.
ఆల్ ఖైదా మద్దతుతో సోమాలియాకు చెందిన ఈ అల్ షబబ్ ఉగ్రవాద సంస్ధ కెన్యాలో అరాచకాలను సృష్టిస్తోంది. కెన్యాకు చెందిన ఉత్తర భాగం సోమాలియాకు అతి సమీపాన ఉండటంతో ఈ సంస్ధ దాడులకు పాల్పడుతుంది.
గత నెలలో సోమాలియాకు సరిహద్దులో ఉన్న మండేరాలో దాడులకు పాల్పడి 12 మంది అతి కిరాతకంగా చంపారు. 2012 నుంచి 2014 వరకు అల్ షబబ్ ఉగ్రవాద సంస్ధ చేసిన దాడుల్లో సుమారు 312 మంది మరిణించినట్లు కెన్యా దేశపు గణాంకాలు తెలుపుతున్నాయి.