విషాదయాత్ర : ఈత కొడుతుండగా చెట్టు కూలి.. 20 మంది విద్యార్థుల దుర్మరణం
జలపాతం దగ్గర ఈత కొడుతున్న సమయంలో గాలుల ధాటికి భారీ వృక్షం నేలకూలిన ఘటనలో 20 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.
కిన్ టాంపో: ఆఫ్రికా దేశంలోని ఘనాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతం దగ్గర ఈత కొడుతున్న విద్యార్థులపై ఉన్నట్లుండి ఓ భారీ వృక్షం కూలింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.
ఘనా దేశంలోని కింటాంపో జలపాతం దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడికి విహారయాత్రకు వచ్చిన విద్యార్థులు జలపాతం దగ్గర ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలోనే తుపాన్ వచ్చింది.
ఒక్కసారిగా పెనుగాలులు వీచడంతో ఆ ధాటికి అక్కడే ఉన్న ఓ వృక్షం ఒక్కసారిగా నేలకూలి విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో మరో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద స్థలికి ఘనా అగ్నిమాపక శాఖ సహాయ కార్యక్రమాలు చేపట్టింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థుల్లో మరికొంతమంది పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది వెంచీ సీనియర్ హైస్కూల్ విద్యార్థులని, మిగిలిన వారు పర్యాటకులని అధికారులు వెల్లడించారు.