కారు బాంబు దాడి, 25 మంది దుర్మరణం
కాబుల్: నాటో సంస్థను, మిలటరీ క్యాంపు కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుని కారు బాంబు పేలుడు జరపడంతో 25 మంది సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అఫ్ఘనిస్థాన్ లో జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అనేక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ లోని కోస్ట్ సిటిలో చాప్ మాన్ క్యాంపు వద్ద నిత్యం రద్దిగా ఉండే రోడ్డులో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఒక కారు దూసుకు వెళ్లింది. నాటో క్యాంపు దగ్గర ఉన్న సైనికులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి చేసేందుకు ప్రయత్నించారు.
అయితే సైనికులు అడ్డుకోవడంతో కారులో ఉన్న వ్యక్తి అందులో ఉన్న బాంబులు పేల్చి వేశాడు. పరిసర ప్రాంతాలలో ఉన్న 20 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. తీవ్రగాయాలైన 21 మందిని కోస్ట్ సిటి ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో ఐదు మంది మరణించారు. ఈ ఆత్మాహుతి దాడిలో సైనికులు ఎవరు మరణించలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికి వరకు దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. తాలిబన్ ఆత్మాహుతి దాడులకు పాల్పడి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.