Pakistan:అంతర్యుద్ధం వేళ కరాచీలో బాంబు పేలుడు...రక్తమోడిన పాక్ ఆర్థిక రాజధాని
కరాచీ: పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. కరాచీలోని గుల్షాన్-ఈ-ఇక్బాల్ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కరాచీ యూనివర్శిటీ మస్కాన్ గేట్కు ఎదురుగా ఉన్న భవంతిలో ఈ భారీ పేలుడు సంభవించింది. గాయపడిన వారిని వెంటనే అధికారులు దగ్గరలోని హాస్పిటల్కు తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. అయితే పేలుడుపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ సిలిండర్ ఆ భవంతిలో పేలిందని తెలుస్తోంది.
మంగళవారం రోజున షీరిన్ జిన్నా కాలనీలోని బస్స్టాప్ వద్ద జరిగిన పేలుడు మరువక ముందే బుధవారం రోజున మరో పేలుడు స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం జరిగిన పేలుడులో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక తాజా ఘటనలో భవంతిలోని రెండో అంతస్తులో పేలుడు జరిగిందని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. సింధ్ పోలీస్ చీఫ్ కిడ్నాప్నకు గురైనట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావెద్ బాజ్వా విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే పేలుడు జరగడం చర్చనీయాంశమైంది.
Recommended Video
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దార్ని అరెస్టు చేసేందుకు కరాచీ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సింద్ పోలీస్ చీఫ్ను పాక్ బలగాలు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆర్థిక రాజధాని అయిన కరాచీలో జరిగిన అల్లర్లలో 10 మంది కరాచీ పోలీసులను చంపేశారని ఇంటర్నేషనల్ హెరాల్డ్ కథనం ప్రచురించింది.పోలీసులు ఆర్మీ మధ్య అంతర్యుద్ధం అక్కడ ప్రారంభమైందని సమాచారం. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దార్ను కరాచీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ర్యాలీలో పాల్గొనేందుకు కరాచీకి వచ్చారు. హోటల్ రూంలో ఉన్న అతన్ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. జిన్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే అతన్ని అరెస్టు చేస్తున్నట్లు కరాచీ పోలీసులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత సఫ్దార్ బెయిల్ పై విడుదలయ్యారు.