హాంకాంగ్ ప్రజల నిరసనలు తారాస్థాయికి: టియర్ గ్యాస్ ప్రయోగం, 30మందికి గాయాలు
హాంకాంగ్: చైనా పెత్తనాన్ని తాము అంగీకరించమని హాంకాంగ్ యువత గత నెల రోజులుగా తీవ్ర ఆందోళనల బాట పట్టిన విషయం తెలిసిందే. లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటూ నినదిస్తున్నారు.
నాయకుడు లేకుండా ఈ ఉద్యమం ఉధృతంగా సాగుతుండటం గమనార్హం. కాగా, ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు చైనా ప్రభుత్వ వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా, స్పాంజ్ గ్రెనెడ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 30 మంది నిరసనకారులకు తీవ్ర గాయాలయ్యాయి.
హాంకాంగ్ నగరంలోని చైనీస్ యూనివర్సిటీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హాంకాంగ్ నుంచి చైనాకు నేరస్తులను అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా ఈ నిరసనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నేరస్తుల అప్పగింత బిల్లుకు ఆమోదం లభిస్తే.. హాంకాంగ్ పూర్తిగా చైనా నియంత్రణలోకి వెళుతోందని నిరసనకారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే హాంకాంగ్ కూడా చైనాలోని ఇతర నగరాల మాదిరే అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు నెలరోజులుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. తమ హక్కులను కాపాడుకుంటామంటూ నినదిస్తున్నారు. చైనా పెత్తనం తమపై అవసరం లేదని అంటున్నారు.
కాగా, ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతుండటంతో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆందోళనల్లో ఓ పౌరుడిని సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. నిరసనకారులతో విభేదించిన కారణంగానే అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలున్నాయి.