ఘోర పడవ ప్రమాదం: ముగ్గురు చిన్నారులతోపాటు 32 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బురిగాంగ నదిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సోమవారం పడవ మునిగిపోవడంతో ముగ్గురు చిన్నారులతోపాటు 32 మంది మరణించారు. ఓల్డ్ ఢాకాలోని శ్యాంబజార్ ప్రాంతం వెంట సోమవారం ఉదయం 9.15 గంటలకు ఎంఎల్ మార్నింగ్ బర్డ్ అనే పడవ మునిగిపోయింది.
ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని గాయాలతో బయటపడిన బాధితులు తెలిపారు. ఎంఎల్ మార్నింగ్ బర్డ్ మరొక పడవ మోయూర్-2ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీని వల్ల నీరు పడవలోకి చేరుకుందని ఢాకా ట్రిబ్యూన్ అగ్నిమాపక సేవా ప్రధాన కార్యాలయం అధికారి రోజినా అక్తర్ వెల్లడించారు.
ప్రమాదానికి గురైన పడవ సామర్థ్యం 45 మందే అయినప్పటికీ మరికొంత మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. వేరొక పడవను బలంగా ఢీకొట్టడంతో నీటిలో మునిగిపోయిందని కమాండర్ గోలం సాడేక్ వెల్లడించారు.
మృతదేహాలను బయటికి తీశామని, ఇప్పుడు పడవను బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.