రైళ్లో భారీ బాంబు పేలుడు : ఐదుగురు దుర్మరణం
క్వెట్టా : బెలూచిస్థాన్ లో భారీ పేలుడు సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం నాడు మధ్యాహ్నాం ఈ ఘటన జరిగినట్లుగా తెలియవస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఘటన ఓ రైలులో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో దాదాపు 17మంది దాకా తీవ్రంగా గాయపడగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం.
రావల్పిండి స్టేషన్ నుంచి నడిచే జాఫర్ ఎక్స్ప్రెస్లో ఈ పేలుడు చోటు చేసుకుంది. బోలన్ జిల్లాలోని అబ్-ఇ-గమ్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వెంబడి పెట్టిన బాంబులు పేలడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, తొలి బాంబు పేలిన 20నిమిషాలకే అదే ప్రాంతంలో మరో బాంబు పేలుడు సంభవించింది.
పేలుళ్లతో వెంటనే అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను వెంటనే క్వెట్టాలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన బలూచిస్థాన్ సీఎం సనౌల్లా జెహ్రీ దీనిపై పూర్తి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా ఆదేశించారు.