కాబూల్లో భారీ పేలుడు: ఐదుగురు మృతి, ఆత్మాహుతి దాడి
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. మంగళవారంనాడు జరిగిన ఈ పేలుడులో కనీసం ఐదుగురు మరణించారని స్థానిక టీవీ చానెళ్లు చెబుతున్నాయి. దాదాపు 42 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆత్మాహుతి దాడిగా దాన్ని భావిస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు సమీపంలోనే ఈ పేలుడు సంభవించింది. జస్టిస్ మంత్రిత్వ శాఖ పార్కింగ్ స్థలంలోని కారులో ఈ పేలుడు సంభవించింది. సెరెనా హోటల్ సమీపంలోనే అది ఉంది.
పేలుడు తీవ్రత భయానకంగా ఉంది. దాని ధాటికి కిలోమీటర్ల దూరం వరకు భవనాల అద్దాలు పగుళ్లు వారాయి. పోలీసు కార్లలో, అంబులెన్స్ల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడింది ఏ సంస్థ అనేది ఇంకా తెలియలేదు.
కాబూల్ అతిథి గృహంలో వారం క్రితం జరిగిన దాడికి తామే కారణమని తాలిబాన్ ప్రకటించకుంది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. వారిలో 9 మంది విదేశీయులున్నారు.