రక్తమోడిన రంజాన్: మసీదు సమీపంలో ఆత్మాహూతి దాడి
లాహోర్: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభంలోనే రక్తమోడింది. ప్రాచీన మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆత్మాహూతి దాడికి తామే కారణమంటూ ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
పాకిస్తాన్లోని లాహోర్లో దాతా దర్బార్ సూఫీ మసీదు సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రంజాన్ మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడానికి దాతా దర్బార్ మసీదుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. దక్షిణ ఆసియా దేశాల్లోనే అత్యంత ప్రాచీన మసీదు ఇది. 11వ శతాబ్దంలో దీన్ని నిర్మించారనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఏటా రంజాన్ మాసం ఆరంభంలో ఈ మసీదుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రత్యేక ప్రార్థనాల్లో పాల్గొంటారు. వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంది అక్కడి ప్రభుత్వం. 2010లో ఇదే మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ దాడలో అప్పట్లో 41 మంది దుర్మరణం పాలయ్యారు. అప్పటి నుంచి ఏటా రంజాన్ మాసంలో ఈ మసీదు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తూ వస్తోంది అక్కడి ప్రభుత్వం.
తాజాగా- భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఆత్మాహూతి దళ ఉగ్రవాదులు మసీదుకు అత్యంత సమీపంలో తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు సహా ఆరుమంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడ్డ వారిలో కొందరు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. సమీపంలోని మాయో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే లాహోర్ సిటీ డివిజన్ ఎస్పీ సయ్యద్ ఘజన్ షా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీన్ని ఉగ్రవాద చర్యగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెప్పారు.