‘ఐఐటీ’ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ భారీ ఆఫర్: ఏడాదికి రూ.1.39కోట్ల ప్యాకేజీ
ముంబై: అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లకు భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న తుది నియామక ప్రక్రియలో మైక్రోసాఫ్ట్.. ఐఐటీ విద్యార్థులకు భారీ వేతనం ఆఫర్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
టాప్ ఐఐటీల క్యాంపస్ వర్గాల సమాచారం మేరకు కంపెనీ తన రెడ్మాండ్ ప్రధాన కార్యాలయంలో ఐఐటీలను నియమించుకోవడానికి ఏడాదికి రూ.1.39 కోట్లను ప్యాకేజీగా ఆఫర్ చేయనున్నట్టు తెలిసింది.
భారీ ప్యాకేజీనే..
మొత్తం ప్యాకేజీ 2,14,600 డాలర్లు కాగా, దానిలో బేసిక్ వేతనం 1,08,000 డాలర్లు, పనితీరు ఆధారిత బోనస్ 21,600 డాలర్లు, జాయినింగ్ బోనస్ 15,000 డాలర్లు, నియంత్రిత స్టాక్యూనిట్లు 70,000 డాలర్లు ఉన్నట్టు వెల్లడవుతోంది.
భారీగా పెంచేసిన మైక్రోసాఫ్ట్
కాగా, గత సంవత్సరం కంటే ఈ వేతనాన్ని మైక్రోసాఫ్ట్ భారీగా పెంచడం గమనార్హం. గత ఏడాది మైక్రోసాఫ్ట్ మొత్తం ప్యాకేజీగానే 1,36,000 డాలర్లను ఆఫర్ చేసింది.
ఉబెర్ రెండో సంస్థగా, కానీ..
మైక్రోసాఫ్ట్ అనంతరం మరో టాప్ రిక్రూటర్గా అమెరికా ఆధారిత ఉబర్ టెక్నాలజీస్ ఉండబోతుందని సమాచారం. ఈ కంపెనీ కూడా బేసిక్ వేతనంగా 1,10,000 డాలర్లను ఆఫర్ చేయబోతున్నట్టు క్యాంపస్ వర్గాలు వెల్లడించాయి. కానీ, బోనస్లు, స్టాక్ ఆప్షన్లు, మైక్రోసాఫ్ట్తో పోలిస్తే తక్కువగానే ఉండబోతున్నాయట. ఉబెర్ టెక్నాలజీస్ ఆఫర్చేసే మొత్తం ప్యాకేజీ రూ.99.87 లక్షలుగా ఉండబోతున్నట్టు సమాచారం.
ఈ వర్సిటీలే ముందున్నాయి..
ఈ ప్యాకేజీలు కాన్పూర్, ముంబై, చెన్నై, బెనారస్ హిందూ యూనివర్సిటీ, రూర్కే క్యాంపస్లకు ఆఫర్ చేయొచ్చని ప్లేస్మెంట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని సార్లు తుది వేతన ప్యాకేజీలు ఇంకా ఎక్కువ ఉండొచ్చని కూడా పేర్కొన్నాయి. అయితే, దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా, ఉబెర్ తాను అందిస్తున్న వేతన వివరాలను తెలుపడానికి తిరస్కరించింది.
ఉబెర్ సంస్థలోనూ ప్లేస్మెంట్స్
ఈ ఏడాది 8ఐఐటీ క్యాంపస్లు-ఢిల్లీ, చెన్నై, ఖరగ్పూర్, రూర్కే, గౌహతి, బీహెచ్యూ, బాంబే, కాన్పూర్లలో ప్లేస్మెంట్లను చేపట్టనున్నట్టు ఉబెర్ ఇండియా, దక్షిణాసియా చీఫ్ పీపుల్ ఆఫీస్ విశ్పాల్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఐఐటీలకు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లు పెరిగిపోయాయి. ఇది ఇన్స్టిట్యూట్లకు గుడ్న్యూస్. సామ్సంగ్ కొరియా కూడా ఈ క్యాంపస్లలో రిక్రూట్ చేసుకున్న వారికి ఏడాదికి రూ.96.8లక్షలు ఆఫర్ చేస్తోంది.