ఘోర ప్రమాదం : బస్సు లోయలో పడి 25 మంది మృతి
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి 500 అడుగుల లోతులో ఉన్న ఓ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దక్షిణ సుమత్రా ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది.
లోయను ఆనుకుని నది ప్రవహిస్తుండటంతో కొన్ని మృతదేహాలు అందులో పడి గల్లంతయ్యాయి. దీంతో గల్లంతైన మృతదేహాలను గాలించేందుకు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బెంగ్కులు ప్రావిన్స్ నుండి పగర్ ఆలమ్కి బయలుదేరిన బస్సు మార్గమధ్యలో అదుపు తప్పి రోడ్డు రెయిలింగ్ను ఢీకొట్టి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
ఇండోనేషియాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు తరుచుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సెప్టెంబర్లో పశ్చిమ జావా సుకబుమి ప్రాంతంలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. కొద్ది నెలల క్రితం అదే రహదారిపై జరిగిన మరో బస్సు ప్రమాదంలో దాదాపు 12 మంది మృతి చెందగా చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు.