ఘోర విమాన ప్రమాదం వీడియో: ల్యాండింగ్ సమయంలో మంటలు..40 మంది మృతి
మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా అందులో అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో విమానంను మంటలు ఆవహించాయి. మాస్కోలో జరిగిన ఈ ఘటనలో విమానంలో ఉన్న 40 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో 11 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
క్రాష్ ల్యాండింగ్తో విమానంలో మంటలు
సుఖోయ్ సూపర్ జెట్-100 విమానం మాస్కోలోని షెరెమెటెవో విమానాశ్రయంలో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో విమానం వెనక భాగంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానం ముందు భాగం నుంచి ప్రయాణికులు బయటకు దూకేప్రయత్నం చేశారు.
పైలట్ల తప్పిదమేనా..?
విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వెంటనే తిరిగి విమానాశ్రయంకు చేరుకుంది.అయితే ఆ సాంకేతిక సమస్య ఏమిటన్నది తెలియరాలేదు. ల్యాండింగ్ అయ్యే సమయంలో కూడా స్మూత్గా కాకుండా క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు రష్యా అధికారులు ఆదేశించారు. అయితే పైలట్లు ఏమైనా ఎయిర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించారా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు అధికారులు.
ప్రమాద సమయంలో విమానంలో 73 మంది ప్రయాణికులు
విమాన ప్రమాద సమయంలో మొత్తం 78 మంది అందులోఉన్నట్లు అధికారులు తెలిపారు. 73 మంది ప్రయాణికులు కాగా 5 మంది సిబ్బంది ఉన్నారు. మాస్కో నుంచి ముర్మాన్స్కు ఈ విమానం వెళ్లాల్సిఉంది. విమానం ఎత్తుకు ఎగిరిన ఏడు నిమిషాలకే కిందకు జారుకుందని అధికారులు చెప్పారు. ఆ సమయంలో విమానం 10వేల అడుగుల ఎత్తులో ఉన్నట్లు విచారణాధికారులు తెలిపారు. దీంతో విమానంలో ఏదో సాంకేతిక సమస్య తలెత్తిందని గ్రహించిన పైలట్లు వెంటనే వెనక్కు మళ్లాలని గ్రహించినట్లు విచారణాధికారులు తెలిపారు.
విచారణ సంస్థలు ఏం చెబుతున్నాయి...?
ఇదిలా ఉంటే విమానంలోని ఇంధనం ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్న సమయంలో విమానం ల్యాండ్ అయిందని ఓ ప్రైవేట్ సంస్థ తెలిపింది. ఏటీసీతో సంబంధాలు కోల్పోయిన తర్వాత తొలి ప్రయత్నంగా క్రాష్ల్యాండింగ్కు పైలట్లు ప్రయత్నించారని ఆ సంస్థ తెలిపింది. అయితే అది విజయవంతం కాకపోవడంతో రెండో సారి ప్రయత్నించినప్పుడు ల్యాండింగ్ గేర్ బలంగా భూమిని తాకడం జరిగిందని ఆ సమయంలో మంటలు చెలరేగినట్లు ప్రైవేట్ విచారణ సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే ఫ్లయిట్ రాడార్ వ్యవస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం విమానం రెండు సార్లు మాస్కో గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది.