డీజిల్ కుంభకోణం: ఆడి సీఈఓ అరెస్ట్
బెర్లిన్: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపెర్ట్ స్టాడ్లర్ సోమవారం అరెస్ట్ అయ్యారు. డీజిల్ ఉద్గారాల స్కాండల్ విచారణలో సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడి సొంతమైన ఫోక్స్ వ్యాగన్ అధికార ప్రతినిధి.. రూపెర్ట్ అరెస్ట్ను సోమవారం ధృవీకరించారు.
కాగా, రూపెర్ట్ను కస్టడీలోకి తీసుకుని రిమాండ్లోకి తరలించాలని జడ్జీ ఆదేశించారు. ఫోక్స్వాగన్ కర్బన్ ఉద్గారాల స్కాండల్లో మాల్ప్రాక్టిస్కు పాల్పడ్డారని రూపెర్ట్పై విచారణ కొనసాగుతోంది. మోసపూరిత సాఫ్ట్వేర్ను పొందుపరిచిన 2,10,000 డీజిల్ ఇంజిన్ కార్లను ఆడి 2009 నుంచి అమెరికా, యూరప్లలో విక్రయించిందని ఆ కంపెనీపై ఆరోపణలున్నాయి.
మే నెలలోనే తమ 60వేల ఏ6, ఏ7 మోడల్స్ను మోసపూరిత సాఫ్ట్వేర్ను కలిగి ఉన్నట్టు కంపెనీ అంగీకరించడం గమనార్హం. ఈ మోసపూరిత ఆరోపణలు, అక్రమ ప్రొడక్ట్ ప్రమోషన్లపై ఈ లగ్జరీ కారు తయారీదారిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.
ఈ మోసంలో ఆడి సీఈవో రూపెర్ట్ పాత్ర ఉందని మునిచ్ న్యాయవాదులు జూన్ 13న ప్రకటించారు. ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. 1994 నుంచి రూపెర్ట్ ఫోక్స్వాగన్-ఆడిలో పనిచేస్తున్నారు.