మయన్మార్ అధ్యక్షుడిగా గెలిచిన సూకీ డ్రైవర్
నైపిడా: మయన్మార్ లో సైనిక నియంత్రణను తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా.. తనకు నమ్మకస్తుడు, మాజీ డ్రైవర్ యు హితిన్ క్యాను అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దింపిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ అనుకున్న ఫలితం సాధించారు.
మంగళవారం ఉదయం మయన్మార్ పార్లమెంటు ఉభయసభల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 652 ఓట్లు పోలవగా, అధ్యక్ష స్థానం కైవసం చేసుకునేందుకు అవసరమైన మెజారిటీని హితిన్ క్యా సాధించారు.
ఆయనకు మొత్తం 360 ఓట్లు లభించాయి. మయన్మార్లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో సూకీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రాజ్యాంగం ప్రకారం సూకీకి విదేశీ బంధం ఉండటంతో అధ్యక్ష పదవికి పోటీ చేసే వీలు లేదు. దీంతో తన పార్టీ తరఫున ఆమెకు అత్యంత నమ్మకస్థుడైన హితిన్ క్యాను దిగువసభ నుంచి అధ్యక్ష పదవికి ప్రతిపాదిస్తున్నట్లు ఎన్ఎల్డీ ప్రకటించింది.
కాగా.. ఎగువసభ నుంచి మరో సభ్యుడిని కూడా ఎన్ఎల్డీ నామినేట్ చేసింది. సైన్యం తరఫున మరో సభ్యుడు బరిలో ఉన్నాడు. ఈ ముగ్గురిలో మంగళవారం ఓటింగ్ జరిపి హితిన్ క్యాను ఎన్నుకున్నారు.