చారిత్రాత్మకం: మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా సూకీ కారు డ్రైవర్
యాంగాన్: మయన్మార్లో రాజకీయాల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం పోరాడి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆంగ్ సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
మయన్మార్ అధ్యక్ష పదవిలో సూకీ మాజీ కారు డ్రైవర్, ఆమె కుటుంబానికి సన్నిహితుడు అయిన హెచ్ టిన్ క్యా (69) ను ప్రతిపాదించాలని నిశ్చయించింది. ఈ మేరకు హెచ్ టిన్ క్యాతో అధ్యక్ష పదవికి నామినేషన్ వేయించినట్లు ఎన్ఎల్డీ పార్టీకి చెందిన దిగువ సభ ఎంపీ ఖిన్ శాన్ లేంగ్ వెల్లడించారు.
కాగా, హెచ్ టిన్ క్యా చాన్నాళ్ల నుంచి సూకీ సలహాదారుగా వ్యవహారిస్తున్నారు. ప్రస్తుతం సూకీ నిర్వహిస్తున్న ఓ చారిటబుల్ సంస్థ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మయన్మార్ ఎన్నికల్లో సూకీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
మయన్మార్ రాజ్యాంగంలోని క్లాజ్ 59ఎఫ్ ప్రకారం అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆంగ్ సాన్ సూకీ అనర్హురాలు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవిలో ఉన్నవారికి విదేశాల్లో బంధువులుండరాదు. కాగా, సూకీ భర్త మైకేల్ అరిస్ బ్రిటిష్ పౌరుడు కాగా, వీరి సంతానం అలెగ్జాండర్, కిమ్ కూడా బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు.
దీంతో సూకీ మయన్మార్ అధ్యక్ష పదవిని చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో పార్టీ ఎంపీలకు కూడా చెప్పకుండా అధ్యక్ష ఎన్నికలకు హెచ్ టిన్ క్యాతో నామినేషన్ వేయించారు. గురువారం సమావేశమైన పార్లమెంట్ ఆ దేశానికి నూతన అధ్యక్షున్ని నియమించింది.
హెచ్ టిన్ క్యా కొత్త దేశాధ్యక్షుడిగా దాదాపు ఖరారయ్యారు. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్ష పదవి కోసం ఎన్నికైన పేర్లపై ప్రజాప్రతినిధులు ఓటింగ్లో పాల్గొంటారు. అందులో గెలిచిన వారే దేశాధ్యక్షులవుతారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎంపికైన క్యావ్ ఆమె 2010లో గృహనిర్బంధం నుంచి విడుదలైనప్పటి నుంచి ఆమె వెంటే ఉన్నారు.
ఈ తాజా అధ్యక్షుడి నియమాకంతో మయన్మార్లో ఏళ్ల తరబడి వస్తున్న సైనిక పాలనకు తెరదించి నూతన ప్రణాళికలతో నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ ముందుకు సాగుతోంది.