ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకుంటున్నారా..? ప్రభుత్వ నిర్ణయంతో మీ ఆశలు ఆవిరైనట్లే..!
కాన్బెర్రా: కరోనావైరస్ ఫలానా రంగంకు మాత్రమే నష్టం చేకూర్చలేదు. అన్ని రంగాలను ఆ రంగాల్లో పనిచేసేవారిపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇక వలసదారులపై వలస కార్మికులపై ఎంతటి తీవ్ర ప్రభావం ఈ మహమ్మారి చూపిందో అందరికీ తెలిసిందే. తాజాగా విదేశాలకు వెళ్లే వలసదారులపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాకు వచ్చి సెటిల్ అయ్యే వలసదారుల సంఖ్యపై పరిమితి విధించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతీయులపై అధిక ప్రభావం చూపనుంది.
తమ దేశంలోకి వలసదారుల ఎంట్రీపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. 2020-21 సంవత్సరానికి వలసదారుల సంఖ్య 30వేలకు కుదిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించింది. 2018-19లో ఈ సంఖ్య 2,32,000గా ఉన్నింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆదేశంకు వలస వెళ్లాలనుకుంటున్న కొన్ని వేలమంది భారతీయులపై ప్రభావం చూపనుంది. ఇందుకు కారణం కరోనా మహమ్మారి. కరోనా మహమ్మారి దెబ్బకు ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కింత బాగుందంటే అందుకు ఒక కారణం వలసదారులు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా రాకతో వలసదారుల సంఖ్యపై ఆంక్షలు విధించే పరిస్థితికి వచ్చింది ఆస్ట్రేలియా. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించడం, సరిహద్దులు మూసివేయడం వంటి చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది.
గురువారం ఆస్ట్రేలియన్ ఎకనామిక్ మరియు ఫిసికల్ అప్డేట్ రిపోర్టు విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించడంతో వీసా అప్లికేషన్ల సంఖ్య తగ్గిపోయిందని తెలుస్తోంది. 2018-19లో ఓవర్సీస్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చే వారి సంఖ్య 2,32,000 ఉండగా 2019-20కి అది 154000కు పడిపోయింది. 2020-21అది 31వేలకు చేరుకుంది. ఇక ఆస్ట్రేలియాలో భారత సమాజానికి చెందిన వారు దాదాపు 7లక్షల మంది ఉన్నారు. ఆస్ట్రేలియాలో నైపుణ్యం కలిగిన వలసదారుల్లో భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారు . అంతేకాదు అక్కడ 90వేల మంది భారతీయ విద్యార్థులు పలు యూనివర్శిటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఇక సరిహద్దులు వచ్చే ఏడాది జనవరిలో తెరుచుకుంటాయని సమాచారం. అయితే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వారు కనీసం రెండు వారాల పాటు హోంక్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ట్రావెల్ బ్యాన్ ఎప్పుడు ఎత్తివేస్తారో అనేదానిపై మాత్రం పూర్తి క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలో కరోనాబారిన పడి 155 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 13,900 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్లో వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన ఈ కరోనావైరస్ ప్రపంచ ఆర్థిక స్థితిగతులనే మార్చేసింది. రానున్న రోజుల్లో ఈ మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది.